Rahul gandhi: ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మరోసారి మండిపడ్డారు. మోదీని ‘రాజా’ అని పేర్కొంటూ పలు వ్యాఖ్యలు చేశారు. ”ఎనిమిదేళ్ళలో దేశంలో 22 కోట్ల మంది యువత ప్రభుత్వ ఉద్యోగాల కోసం క్యూలో నిలబడ్డారు. వారిలో కేవలం 7.22 లక్షల మంది మాత్రమే ఉద్యోగాలు పొందారు. 1,000 మందిలో కేవలం ముగ్గురికి మాత్రమే ఉద్యోగాలు దక్కాయి. నిరుద్యోగం గురించి ప్రశ్నిస్తే రాజా (రాజు)కు కోపం వస్తుంది. నిజం ఏంటంటే… ఉద్యోగాలు ఇచ్చే సామర్థ్యం మోదీకి లేదు. దేశానికి ఓ సంపదలాంటి వారు యువత. కానీ, వారిని కేంద్ర ప్రభుత్వం ఓ భారంలా చూపెడుతోంది” అని రాహుల్ గాంధీ హిందీలో ట్వీట్ చేశారు.
కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకా గాంధీ కూడా విమర్శలు గుప్పించారు. ”ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానని నరేంద్ర మోదీ అన్నారు. ఇప్పుడు దేశ యువత అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా తప్పించుకుంటున్నారు. నిరుద్యోగ సమస్యపై అడుగుతోన్న ప్రశ్నలకు పార్లమెంటు, మీడియా సమావేశంలో ఆయన సమాధానాలు చెప్పడం లేదు” అని ప్రియాంకా గాంధీ అన్నారు. కాగా, దేశంలో ఎన్నడూ లేనంతగా నిరుద్యోగ సమస్య పెరిగిపోయిందని కాంగ్రెస్ పార్టీ ఆందోళన వ్యక్తం చేస్తోంది. 2014-2022 మధ్య దేశంలో మొత్తం 22.05 కోట్ల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తులు చేసుకున్నట్లు నిన్న లోక్ సభకు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. వారిలో 7.22 లక్షల మందికి ఉద్యోగాలు దక్కినట్లు పేర్కొంది. ఈ అంశాన్నే రాహుల్, ప్రియాంక ఇవాళ ప్రస్తావించారు.
India vs West Indies: 98 పరుగులు చేశాక వర్షం పడడంపై శుభ్మన్ గిల్ అసంతృప్తి