Korutla Deepthi Murder Case : జగిత్యాల జిల్లా కోరుట్లలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ దీప్తి కేసు తీవ్ర సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అక్క అనుమానాస్పద రీతిలో చనిపోయింది. చెల్లెలు చూస్తే అదృశ్యం అయ్యింది. అసలేం జరిగింది? అనేది మిస్టరీగా మారింది. ఈ కేసుని సవాల్ గా తీసుకున్న పోలీసులు మిస్టరీని చేధించారు. పోలీసుల విచారణలో సంచలన, షాకింగ్ నిజాలు బయటపడ్డాయి.
దీప్తిది మర్డర్ అని నిర్ధారించారు పోలీసులు. అంతకన్నా షాకింగ్ నిజం ఏంటంటే.. దీప్తిని చంపింది సొంత చెల్లి చందనే. తన ప్రియుడు ఉమర్ తో కలిసి పారిపోయేందుకు చందన్ ప్లాన్ చేసిందని, అందులో భాగంగానే ఇంట్లో ఉన్న నగలు, డబ్బుతో ఎస్కేప్ అవ్వాలని చూసిందని, అయితే చివరి నిమిషంలో దీప్తి లేచి అరవడంతో దారుణం జరిగిపోయిందని పోలీసులు వెల్లడించారు.
సీనియర్ ఉమర్ తో చందన ప్రేమాయణం:
ఈ సంచలన కేసు వివరాలను జగిత్యాల జిల్లా ఎస్పీ మీడియాకు వెల్లడించారు. ”ఆగస్టు 28వ తేదీ అర్థరాత్రి ఈ ఘటన జరిగింది. వంకా చందన 2019లో హైదరాబాద్ లోని మల్లారెడ్డి కాలేజీలో బీటెక్ జాయిన్ అయ్యింది. చందనకు లవర్ ఉన్నాడు. అతడి పేరు ఉమర్ షేక్ సుల్తాన్(25). ఉమర్ చందనకు సీనియర్. ఇద్దరి మధ్య పరిచయం ప్రేమగా మారింది. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఆగస్టు 19న ఉమర్ కోరుట్ల వచ్చాడు. చందనను కలిశాడు. పెళ్లి చేసుకుందాం అని చందన అడిగింది.
తల్లిదండ్రులు లేని సమయంలో చందన మాస్టర్ ప్లాన్..
అయితే లైఫ్ లో సెటిల్ అవ్వలేదు. పెళ్లి చేసుకుంటే ఇబ్బందులు పడాల్సి వస్తుందని ఉమర్ చెప్పాడు. ఉమర్ ను పెళ్లి చేసుకోవాలని చందన్ ప్లాన్ చేసింది. అందులో భాగంగానే ఆగస్టు 28న ఫోన్ చేసింది. మా అమ్మ నాన్న హైదరాబాద్ వెళ్తున్నారు. నేను మా అక్క దీప్తి మాత్రమే ఇంట్లో ఉంటాము అని చెప్పింది. నువ్వు వచ్చి నన్ను తీసుకెళ్లు. నా దగ్గర డబ్బు, బంగారం ఉంది. దాంతో మనం ఎక్కడికైనా వెళ్లి పెళ్లి చేసుకుని సెటిల్ అవుదామని ఉమర్ తో చెప్పింది. చందన చెప్పడంతో ఆగస్టు 28న ఉదయం ఉమర్ హైదరాబాద్ నుంచి కారులో కోరుట్లకు బయలుదేరాడు.
ప్లాన్ లో భాగంగానే వోడ్కా, బ్రీజర్ తెప్పించిన చందన:
ఉదయం 11గంటలకు కోరుట్లకు చేరుకున్నాడు. ప్లాన్ లో భాగంగా తన అక్కకు వోడ్కా, బ్రీజర్ తెప్పించింది చందన. రాత్రి తన తండ్రితో మాట్లాడాక అక్క, చెల్లి ఇద్దరూ వోడ్కా, బ్రీజర్ తాగి పడుకున్నారు. ఈ అవకాశం కోసం ఎదురుచూస్తున్న చందన అర్థరాత్రి 2గంటల ప్రాంతంలో ఉమర్ షేక్ కు మేసేజ్ చేసింది. అతడు చందన ఇంటి వెనుక కారు పెట్టేసి చందన ఇంట్లోకి వెళ్లాడు. చందన, ఉమర్ ఇద్దరూ కలిసి డబ్బు, నగలు తీస్తున్న సమయంలో ఊహించని విధంగా దీప్తి లేచింది. తన చెల్లి చందనను అరిచింది. దాంతో దీప్తి అరవకుండా ఉండేందుకు స్కార్ప్ తో దీప్తి ముక్కు, మూతిని క్లోజ్ చేసింది చందన. ఆ తర్వాత నోటికి ప్లాస్టర్ కూడా వేసింది. దాంతో దీప్తి చనిపోయింది. ఆ వెంటనే డబ్బు, నగలు బ్యాగులో వేసుకుని తన లవర్ ఉమర్ తో కారులో హైదరాబాద్ వెళ్లిపోయింది చందన” అని పోలీసులు వెల్లడించారు.