NTR Rs 100 Coin
NTR Rs 100 Commemorative Coin Sale : దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు శతజయంతి సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ముద్రించిన 100 రూపాయల స్మారక నాణేన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సోమవారం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ సాంస్కృతిక కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ నాణెంను మంగళవారం విక్రయానికి అందుబాటులో ఉంచారు. దీంతో తొలిరోజు విశేష స్పందన లభించింది. సైఫాబాద్, చర్లపల్లి మింట్ లలో మంగళవారం ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు నాణేన్ని విక్రయానికి అందుబాటులో ఉంచారు. రెండు కేంద్రాల్లో కలిపి తొలిరోజు ఐదు వేల వరకు నాణేలు విక్రయాలు జరిగాయి.
ఆన్లైన్లో నిమిషాల్లోనే ఖాళీ అయ్యాయి. మంగళవారం ఉదయం 10గంటల నుంచి ఇండియా గవర్నమెంట్ మింట్ వెబ్సైట్లోఆన్లైన్లో ఎన్టీఆర్ స్మారక నాణేలను విక్రయానికి అందుబాటులో పెట్టారు. దీంతో కొద్ది నిమిషాల్లోనే ముద్రించిన నాణేలన్ని విక్రయాలు జరిగిపోయాయి. దీంతో ఆన్లైన్లో విక్రయాలు ప్రారంభించిన కొద్ది గంటలకే వెబ్సైట్లో అవుటాఫ్ స్టాక్ బోర్డు పెట్టారు. ఇప్పటి వరకు ఏ స్మారక నాణేన్ని పదివేలకు మించి ముద్రించలేదని, ఎన్టీఆర్ నాణేనికి డిమాండ్ ఉంటుందని భావించి 12వేలు ముద్రించామని మింట్ ఫైనాన్స్ జాయింట్ జనరల్ మేనేజర్ గుండపునీడి శ్రీనివాస్ చెప్పారు.
NTR 100 Rupees Coin Release: ఎన్టీఆర్ శతజయంతి స్మారక నాణెం విడుదల చేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
సైఫాబాద్, చర్లపల్లి మింట్ కేంద్రాల వద్ద కలిపి తొలిరోజు ఐదు వేల వరకు ఎన్టీఆర్ స్మారక రూ. 100 నాణేలు విక్రయాలు జరిగాయి. ప్రస్తుతానికి 12వేలు ముద్రించగా.. మరో 8వేలు ముద్రణకు సిద్ధంగా ఉన్నట్లు తెలిసింది. ఏ స్మారక నాణెమైనా ఒకే థీమ్ తో తయారవుతుంది. కానీ, ఎన్టీఆర్ నాణెం మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంది. అయితే, చెక్కపెట్టెలలో ఉన్న నాణేలకు అధిక డిమాండ్ ఉందని, అవి స్టాక్ తక్కువగా ఉన్నాయని మింట్ జాయింట్ జనరల్ మేనేజర్ శ్రీనివాస్ తెలిపారు.