vykuntapuram ashramam excavation : క్రీస్తు పూర్వం ఒకటో శతాబ్దానికి చెందిన బౌద్ధ ఆనవాళ్లు గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం వైకుంఠపురంలో బయటపడ్డాయని పురావస్తు పరిశోధకుడు, కల్చరల్ సెంటర్ ఆఫ్ విజయవాడ, అమరావతి సీఈవో డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి తెలిపారు.
వైకుంఠపురంలోని భవఘ్ని ఆశ్రమ నిర్మాణానికి పునాదులు తవ్వుతుండగా బయటపడిన పురాతన వస్తువులను ఆయన పరిశీలించారు. ఇనుప యుగానికి చెందిన నల్లటి మెరిసే పాత్రలు, శాతవాహన కాలపు నూరుడురాయి, విహారాల కప్పుల పెంకులు, బౌద్ధ స్తూపంపైన అలంకరించిన పాలరాతి పగిలిన చత్రము(గొడుగు) పరిశీలించారు.
వీటిని బట్టి రెండు వేల ఏళ్ల కిందట కొండపై బౌద్ధశాఖకు చెందిన స్థావరం ఉందనే విషయం నిర్ధారణ అయిందన్నారు. గొడుగు లోపల తాటాకు గొడుగు మాదిరిగా అందంగా చెక్కారని తెలిపారు. పైభాగంలో క్రీస్తుపూర్వం ఒకటో శతాబ్దం నాటి బ్రహ్మిలిపిలో పుసనదానం అనే ప్రాకృత శాసనం ఉందని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా శాసన విభాగ సంచాలకులు డాక్టర్ కె.ముణిరత్నం రెడ్డి ధ్రువీకరించారని వివరించారు.
చారిత్రక ప్రాధాన్యం గల ఈ పురాతన వస్తువులను తాము నిర్మిస్తున్న వ్యాసభగవానుని ఆలయ సంగ్రహాలయంలో ప్రదర్శించి, భద్రపరుస్తామని భవఘ్ని ఆశ్రమ నిర్వహకులు చెప్పారని శివనాగిరెడ్డి పేర్కొన్నారు.