కేంద్ర ఎన్నికల సంఘం లోక్సభ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడంతో దేశ వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఎన్నికలు కోడ్ అమల్లోకి రావడంతో మంత్రులు, ఇతర అధికారులు ఎలాంటి ఆర్థిక గ్రాంట్లు ప్రకటించడానికి వీలు ఉండదు. శంకుస్థాపనలు లేదా ఏ రకమైన ప్రాజెక్టులు, పథకాలను ప్రారంభించకూడదు.
రోడ్ల నిర్మాణం, తాగునీటి సౌకర్యాలు కల్పించడం మొదలైన వాటికి సంబంధించిన హామీలు ఇవ్వకూడదు. దేశంలో స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలను జరపడానికి రాజ్యాంగ అధికారం ప్రకారం ఈసీఐ రాజకీయ పార్టీలు, అభ్యర్థుల విషయంలో ఈ నిబంధనలను అమలు చేస్తుంది. ఎన్నికల సర్వేలను ప్రకటించకూడదు. ప్రభుత్వ అధికారులను పార్టీలు ఎన్నికల కోసం వాడుకోకూడదు.
ఎలాంటి లోపాలు లేకుండా ఎన్నికలు జరపాలన్నదే తమ లక్ష్యమని ఎన్నికల సంఘం ప్రధానాధికారి రాజీవ్ కుమార్ అన్నారు. అభ్యర్థుల వివరాలు ఓటర్లు తెలుసుకోవచ్చని చెప్పారు. కేవైసీ యాప్ లో అన్ని వివరాలు ఉంటాయన్నారు. ఎవరైనా తాయిలాలు, నగదు పంచితే ఫొటో తీసి తమకు పంపాలని రాజీవ్ కుమార్ కోరారు.
సెల్ ఫోన్ లొకేషన్ ను బట్టి 100 నిమిషాల్లో ఆ ప్రాంతానికి చేరుకుంటామని చెప్పారు. ధనబలం, కండబలం నియంత్రణ తమ ముందు ఉన్న పెద్ద సవాల్ అని తెలిపారు. సి-విజిల్ యాప్ ద్వారా ఫిర్యాదు స్వీకరిస్తామని వివరించారు. ఓటర్లు ఫేక్ న్యూస్ ను షేర్ చేయకూడదని అన్నారు. తప్పుడు ప్రచారం వ్యాప్తి చేసే వారిపై నిఘా ఉంటుందని తెలిపారు.