MLC Ananthababu remand : కాకినాడలో సంచలనం సృష్టించిన కారు డ్రైవర్ సుబ్రమణ్యం హత్య కేసులో ఎమ్మెల్సీ అనంతబాబుకు కాకినాడ మెజిస్ట్రేట్ 14 రోజుల రిమాండ్ విధించింది. వచ్చే నెల 6 వరకు రిమాండ్లో ఉంచాలని ఆదేశించారు. దీంతో ఎమ్మెల్సీ అనంతబాబును పోలీసులు రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. అంతకుముందు.. అనంతబాబుకు కాకినాడ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు.
తర్వాత మెజిస్ట్రేట్ ముందు అనంతబాబును హాజరుపర్చారు. దాదాపు గంటకుపైగా వాదనలు జరిగాయి. అనంతబాబుకు బెయిల్ ఇవ్వాలని ఆయన తరపు న్యాయవాది వాదించారు. అయితే మెజిస్ట్రేట్ మాత్రం పోలీసుల వాదనతో ఏకీభవించారు. అనంతబాబుకు 14 రోజుల రిమాండ్ విధించారు. మరోవైపు సుబ్రమణ్యం కేసులో పోలీసులు చెప్తున్నదానిపై కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
MLC Ananthababu : వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుపై హత్య కేసు నమోదు
సుబ్రమణ్యాన్ని వేరే వ్యక్తితో అనంత పిలిపించినట్లు వారి కుటుంబసభ్యులు చెబుతున్నారు. పోలీసులు మాత్రం స్వయంగా అనంతబాబే అతన్ని తీసుకెళ్లినట్లు చెబుతున్నారు. పథకం ప్రకారం జరిగిన హత్య కాదంటున్నారు. అలాగే రాత్రి పదిన్నర గంటల సమయంలో శంకరటవర్స్ లాంటి జనం తిరిగే ప్రాంతంలో గొడవ జరిగిందని పోలీసులు అంటున్నారు.
దానికి సంబంధించి ఆధారాలపై స్పష్టత లేదు. అలాగే మృతుడి శరీరంపై ఇసుక ఉందని, నీళ్లలో నానిన ఆనవాళ్లున్నాయని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ ఇసుక ఎక్కడి నుంచి వచ్చిందన్నదానిపై స్పష్టత లేదు. అలాగే సుబ్రమణ్యం చేతులు వెనక్కు విరిచిన ఆనవాళ్లున్నట్లు చెబుతున్నారు. ఇది ఎలా జరిగిందన్నదానిపై క్లారిటీ లేదు.