Kamareddy : తల్లి,కొడుకు ఆత్మహత్య..మా చావుకి ఆ ఏడుగురే కారణం

కామారెడ్డిలో విషాదం చోటు చేసుకుంది. కొత్త బస్టాండ్ వద్దగల ఓ లాడ్జిలో తల్లీ కుమారుడు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన కామారెడ్డిలో కలకలం సృష్టించింది.

Kamareddy :  కామారెడ్డిలో విషాదం చోటు చేసుకుంది. కొత్త బస్టాండ్ వద్దగల ఓ లాడ్జిలో తల్లీ కుమారుడు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన కామారెడ్డిలో కలకలం సృష్టించింది. వ్యక్తిగత విషయాలను అడ్డం పెట్టుకుని తమను ఏడుగురు వ్యక్తులు వేధిస్తున్నారని తమ మృతికి ఏడుగురు వ్యక్తులు కారణమంటూ తల్లి, కొడుకు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. మృతి చెందిన వారు మెదక్ జిల్లా రామాయంపేట చెందిన తల్లి గంగు పద్మ, కుమారుడు గంగు సంతోష్(35) గా గుర్తించారు.

18 నెలలుగా రామయంపేట్ మున్సిపల్ చైర్మన్ జితేంద్ర గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ సరాఫ్ యాదగిరి, పృథివిరాజ్,తోట కిరణ్, కన్నాపురం కృష్ణగౌడ్, స్వరాజ్ లతోపాటు గతంలో రామయంపేట్ సిఐ గా పనిచేసిన నాగర్జున గౌడ్ లు వేధిస్తున్నారని సెల్ఫీ వీడియో తీసుకొని పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. గత 18 నెలల క్రితం రామయంపేట్ సిఐ నాగార్జున గౌడ్ సంతోష్ సెల్ ఫోన్ తీసుకుని పది రోజుల పాటు తన వద్ద ఉంచుకున్నాడు.

సంతోష్‌కు సంబంధించిన పూర్తి డాటాను నాగర్జున గౌడ్ తస్కరించి ప్రస్తుత మార్కెట్ కమిటీ చైర్మన్‌గా ఉన్న జితేందర్ గౌడ్‌కు అప్పగించాడు. గంగు సంతోష్ సెల్ ఫోన్ లో ఉన్న వ్యక్తిగత డేటా ఆధారంగా గంగు సంతోష్ ను ఏడుగురు వ్యక్తులు వేధించడం మొదలు పెట్టారు. సంతోష్‌తో పాటు కుటుంబ సభ్యులను, అక్క బావలను సైతం ఈ ఏడుగురు వ్యక్తులు వేధించారు. దీంతో 18 నెలలుగా గంగు సంతోష్ కుటుంబ సభ్యులు తీవ్ర మనోవేదనకు గురి అయ్యారు.

ఈ విషయంపై గంగు సంతోష్ ఉన్నత స్థాయి అధికారులతో పాటు మంత్రులకు సైతం ఫిర్యాదు చేశాడు. అయినప్పటికీ ఎలాంటి న్యాయం జరగడం లేదని భావించి ఆత్మహత్య చేసుకునేందుకు నిర్ణయించుకున్నాడు. దీంతో ఈ నెల 11వ తేదీన సంతోష్ తన తల్లితో కలిసి కామారెడ్డి కి వచ్చి న్యూ మహారాజా లాడ్జిలో బస చేశారు. తల్లి ఆరోగ్యం గురించి ఆస్పత్రికి వచ్చామని లాడ్జిలో రూమ్ తీసుకుని బసచేశారు.
Also Read : Bandi sanjay : కేసీఆర్‌ను గద్దె దించేదాక నా పోరు ఆగదు.. గద్వాల జిల్లాలో కొనసాగుతున్న ప్రజా సంగ్రామ యాత్ర

చనిపోయేముందు సంతోష్, తల్లి పద్మలు సెల్ఫీ వీడియో ద్వారా తమ మృతికి ఏడుగురు వ్యక్తులు కారణమంటూ సెల్ఫీ వీడియోను విడుదల చేశారు. సెల్ఫీ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. శనివారం ఉదయం తెల్లవారుజామున పెట్రోల్ పోసుకుని తల్లి పద్మ, కుమారుడు సంతోష్ ఆత్మహత్య చేసుకున్నారు. విషయం తెలుసుకున్న కామారెడ్డి డీఎస్పీ సోమనాథం, సీఐ నరేశ్ లు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించి బాధితుల కుటుంబాలకు అందచేశారు. మృతుల బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు