Earthquake in Indonesia : ఇండోనేషియాలో భూకంపం సంభవించింది. భారీ భూ ప్రకంపనలతో ఇండోనేషియా మరోసారి తీవ్ర భయాందోళనలకు గురైంది. ఇండోనేషియాలోని తూర్పు ప్రావిన్స్ పపువా బరాత్లో గురువారం (నవంబర్ 11,2021) తెల్లవారుజామున 12.46 గంటలకు సంభవించిన భారీ భూకంపంతో ప్రజలు తీవ్ర భయాందోళనలు చెందారు. ఇళ్లల్లో నిద్రపోతున్న ప్రజలంతా.. భయంతో బయటకు పరుగులు తీశారు.
ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.1గా నమోదైనట్లు వాతావరణ సంస్థ జియోఫిజిక్స్ ఏజెన్సీ వెల్లడించింది. ఇండోనేషియా కైమానా జిల్లా కేంద్రానికి 115 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉందని..సముద్ర గర్భం కింద 14 కిలోమీటర్ల లోతులో భూమి కంపించిందని అధికారులు వెల్లడించారు. ఈ భూకంపం వల్ల సునామీ వచ్చే అవకాశం లేదని..ప్రజలు ఎటువంటి భయాందోళనలకు గురి కావద్ధని వాతావరణ శాస్త్ర, జియోఫిజిక్స్ ఏజెన్సీ సూచించింది.
భూకంపం వల్ల ఆస్థి నష్టానికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది. కాగా డోనేషియాలో తరచూ భూకంపాలు సంభవిస్తున్న విషయం తెలిసిందే. ఈక్రమంలో గురువారం తెల్లవారుజామున 12.46 గంటలకు మరోసారి భూ ప్రకంపనలతో ప్రజలు అల్లాడిపోయారు. ఇళ్లనుంచి బయటకు పరుగులు తీశారు. ప్రాణాలు దక్కితే చాలు అన్నట్లుగా బయటకు పరుగులు తీశారు.