Russia-Ukraine War : రష్యాతో యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో యుక్రెయిన్ ఎదుర్కొనే పరిణామాలపై ఆ దేశ అధ్యక్షుడు జెలెన్ స్కీ చర్చల ప్రతిపాదనతో ముందుకు వచ్చారు. రష్యా ఇచ్చిన ఆఫర్ను జెలెన్ స్కీ స్వాగతించారు. ఈ నేపథ్యంలో ఆయన మరోసారి రష్యాకు విజ్ఞప్తి చేశారు. నేరుగా చర్చలు జరుపుదామంటూ పుతిన్ను కోరారు. ఈ క్రమంలోనే యుక్రెయిన్ ప్రతిపాదనకు సమ్మతించిన పుతిన్.. యుక్రెయిన్తో చర్చలకు తమ ప్రతినిధుల బృందాన్ని పంపేందుకు సిద్ధమయినట్టు తెలుస్తోంది.
అంతకుముందు.. యక్రెయిన్పై రష్యా కీలక ప్రకటన చేసింది. యుద్ధం మొదలైన 40 గంటల తర్వాత యుక్రెయిన్కు రష్యా ఆఫర్ ఇచ్చింది. ఆయుధాలు వదిలితేనే యుక్రెయిన్తో చర్చలకు సిద్ధమని రష్యా స్పష్టం చేసింది. రష్యా సైన్యంపై పోరాటాన్ని, ఆయుధాలు వదిలిస్తే.. చర్చలకు సిద్ధమే అంటూ రష్యా విదేశాంగ మంత్రి సెర్గీలారోవ్ ప్రకటించారు. అయితే యుక్రెయిన్ను నియో-నాజీల తరహాలో పాలించడం మాస్కోకు సైతం ఇష్టం లేదని సెర్గీలారోవ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
అదే సమయంలో రష్యాతో చర్చలకు సిద్ధంగా ఉన్నట్టు యుక్రెయిన్ అధ్యక్షుడు స్పష్టం చేశారు. యూరప్పై జరుగుతున్న యుద్ధంగానే చూడాలని జెలెన్స్కీ పుతిన్కు సూచించారు. ఇది యుక్రెయిన్పై మాత్రమే జరుగుతున్న యుద్ధం కాదన్నారు. యుక్రెయిన్ పౌరుల ప్రాణాలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.
యుద్ధం ఆపాలంటూ యూరప్ వాసులంతా డిమాండ్ చేయాలని జెలెన్స్కీ సూచించారు. యుక్రెయిన్కు మిలటరీ, ఆర్థిక సాయం అందించేలా మీ దేశాలపై ఒత్తిడి పెంచాలని యుక్రెయిన్ అధ్యక్షుడు యూరప్ వాసులకు ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు. అమాయక ప్రజలు యుద్ధం కారణంగా చనిపోకుండా ఆపేందుకు చర్చలకు సిద్ధమని జెలెన్ స్కీ సూచించారు. ఇరు దేశాలు చర్చల ప్రస్తావన తేవడంతో యుద్ధం దాదాపు ముగింపు దశకు వచ్చినట్లే కనిపిస్తోంది. రష్యా-యుక్రెయిన్లు సయోధ్య దిశగా అడుగులు పడుతున్నట్టు కనిపిస్తుండటంతో ప్రపంచ దేశాలు సైతం ఊపిరి పీల్చుకుంటున్నాయి.
Read Also : Russia-Ukraine War : యుద్ధం ఆపేయండి.. పుతిన్తో నేరుగా చర్చలకు సిద్ధం.. యుక్రెయిన్ అధ్యక్షుడు