BCCI Media Rights
BCCI Media Rights : బీసీసీఐ (BCCI) కి భారీ ఆదాయం సమకూరనుంది. వచ్చే ఐదేళ్లలో సుమారు రూ.8,200 కోట్లు ఆదాయం సమకూరుతుందని బీసీసీఐ అంచనా వేస్తోంది. ఇది కేవలం సొంతగడ్డపై టీమిండియా ఆడే మ్యాచ్లకు మాత్రమే. ఎలా అంటే.. భారత జట్టు (Team india) వచ్చే ఐదేళ్లకాలంలో (2023-2028)లో సొంతగడ్డపై 88 మ్యాచ్లు ఆడేలా బీసీసీఐ ప్లాన్ చేసింది. అయితే, ఈ మ్యాచ్లకు సంబంధించి మీడియా హక్కుల (Media Rights) ద్వారా బీసీసీఐ రూ. 8200 కోట్లు రానున్నట్లు తెలుస్తోంది. మీడియా హక్కుల అమ్మకానికి ఇప్పటికే బోర్డు టెండర్లను ఆహ్వానించింది.
ఈ ఐదేళ్లలో స్వదేశంలో భారత్ జట్టు 25 టెస్టు మ్యాచ్లు, 27 వన్డే మ్యాచ్లు, 36 టీ20 మ్యాచ్లు ఆడనుంది. ఇందులో ఆసీస్తో 21 మ్యాచ్లు, ఇంగ్లాండ్తో 18 మ్యాచ్లు ఉన్నాయి. 2018 – 2023 ఐదేళ్ల కాలంలో బీసీసీఐ మీడియా హక్కుల ద్వారా రూ. 6,138 కోట్లు ఆర్జించింది. స్టార్ ఇండియా డిజిటల్, టీవీ హక్కులను దక్కించుకుంది. అంటే ఒక్కో అంతర్జాతీయ మ్యాచ్ ధర రూ. 60కోట్లు. అయితే, ఈసారి.. టీవీ, డిజిటల్ హక్కులను వేరువేరుగా వేలం ప్రక్రియ నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించింది.
గత ఐపీఎల్ మీడియా హక్కుల వేలం సమయంలో రిలయన్స్ డిజిటల్ బిడ్ను గెలుచుకుంది. స్టార్ టీవీ హక్కులను గెలుచుకుంది. దీంతో బీసీసీఐకి రూ.48,390 కోట్లు ఆదాయం వచ్చింది. ఈ క్రమంలో ఐపీఎల్ విధానం మాదిరిగా బీసీసీఐ టీవీ, డిజిటల్ హక్కులకు వేరువేరుగా బిడ్లను ఆహ్వానిస్తుంది. బిడ్డింగ్ విధానం ఈ-వేలం ద్వారా నిర్వహించబడుతుంది. ఈ ఏడాది సెప్టెంబర్ నెల మొదటి వారంలో వేలం షెడ్యూల్ను బీసీసీఐ ప్రకటించేందుకు సిద్ధమవుతుంది. ఈనెల 25 వరకు దరఖాస్తుల గడువు ముగుస్తుంది.
సెప్టెంబర్లో నిర్వహించే వేలంలో పాల్గొనేందుకు పలు కంపెనీలు ఇప్పటికే రూ.15లక్షల విలువైన బిడ్ పత్రాలను కొనుగోలు చేశాయి. అయితే, ప్రధానంగా టీమిండియా ప్రసార హక్కులను కొనుగోలు చేసేందుకు మూడు సంస్థలు పోటీ పడుతున్నట్లు సమాచారం. వాటిలో డిస్నీ హాట్స్టార్, రిలయన్స్ – వయాకామ్, జీ-సోనీలు ఉన్నట్లు బీసీసీ వర్గాల ద్వారా తెలిసింది.