Sonu Sood : కరోనా మహమ్మారి సమయంలో సేవా కార్యక్రమాలతో దేశ ప్రజల ఆదరణ పొందిన నటుడు, పేద ప్రజల ఆపద్భాంధవుడిగా గుర్తింపు పొందిన వ్యక్తి సోనూ సూద్. ఆపదలో ఉన్న ఎంతోమందికి సాయం చేసిన గొప్ప మానవతావాదిగా సోనూ గుర్తింపు పొందాడు. కాగా, సోనూసూద్ రాజకీయాలపై సంచలన ప్రకటన చేశాడు. సోనూ సూద్ ఫ్యామిలీ పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చింది. తన సోదరి మాళవికా సూద్ ఎన్నికల్లో పోటీ చేస్తుందని సోనూ ప్రకటించాడు.
రాబోయే పంజాబ్ ఎన్నికల్లో మోగా నియోజకవర్గం నుంచి మాళవికా బరిలో నిలుస్తుందని సోనూ వెల్లడించాడు. తన సోదరి మాళవికా సూద్ తో కలిసి మీడియాతో ఈ విషయాన్ని ప్రకటించాడు. అయితే, ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారన్న విషయంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, సరైన సమయంలో ఆ నిర్ణయం ప్రకటిస్తామని చెప్పాడు.
Raja Ravindra : “ఎవరు మీలో కోటీశ్వరులు” షో లో తొలిసారి కోటి రూపాయలు గెలుచుకున్న ఎస్ఐ
ప్రజలకు సేవ చేసేందుకు మాళవిక సిద్ధమైందని సోనూ చెప్పాడు. ఇటీవలే తాను రాష్ట్ర ముఖ్యమంత్రి చరణ్ జిత్ సింగ్ చన్నీని కలిశానని, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధినేత అరవింద్ కేజ్రీవాల్, శిరోమణీ అకాలీదళ్ అధ్యక్షుడు సుక్బీర్ సింగ్ బాదల్ నూ కలుస్తానని చెప్పాడు. ఏ రాజకీయ పార్టీలో చేరాలన్నది సిద్ధాంతాలకు సంబంధించిన విషయమని, సమావేశాలతో అదయ్యేది కాదని అన్నాడు.
తాను రాజకీయాల్లోకి వస్తానా? రానా? అన్నది పక్కన పెట్టాలని, దానిపై తన నిర్ణయాన్ని తర్వాత ప్రకటిస్తానని చెప్పాడు. ముందు మోగాలో మాళవికకు మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నిస్తానని అన్నాడు. ఆరోగ్య రంగమే ఆమెకు కీలకమని, గెలిస్తే కిడ్నీ పేషెంట్లకు ఉచితంగా డయాలిసిస్ సేవలను అందిస్తుందని చెప్పాడు. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యపైనా పోరాడుతుందన్నారు. ఉద్యోగం లేనప్పుడే యువత డ్రగ్స్ తీసుకుని చెడు దారులు తొక్కుతుందని సోనూ అన్నాడు.