CM KCR: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీలోని తన నివాసంలో ఇవాళ సమాజ్ వాదీ పార్టీ (ఎస్పీ) అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్తో సమావేశమయ్యారు. జాతీయ రాజకీయాలపై వారిరువురు చర్చించారు. వారిద్దరి మధ్య దాదాపు గంట సేపు చర్చలు జరిగాయి. దేశంలో నెలకొన్న సమస్యలు, రాజకీయ పరిస్థితులపై వారు ప్రధానంగా చర్చించారు. ఎస్పీ నేత రామ్ గోపాల్ యాదవ్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. గత మూడు రోజులుగా సీఎం కేసీఆర్ ఢిల్లీలోనే ఉంటున్నారు.
అక్కడ టీఆర్ఎస్ ఎంపీలతో పలుసార్లు సమావేశాలు నిర్వహించారు. అలాగే, రైతు సంఘాల ప్రతినిధులను కూడా కేసీఆర్ కలవనున్నారు. కేంద్ర సర్కారుపై పోరాటానికి కేసీఆర్ మరోసారి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న అసంబద్ధ వైఖరిపై పోరాడాలని ఆయన భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఆయన పలువురు విపక్ష నేతలతో చర్చలు జరిపిన విషయం తెలిసిందే. పార్లమెంటులో కేంద్ర సర్కారు తీరును ఎండగట్టే అంశంపై కూడా తమ ఎంపీలకు కేసీఆర్ సూచనలు చేశారు.
Viral video: రైల్వే స్టేషన్లో వృద్ధుడిని కాళ్ళతో తంతూ రెచ్చిపోయిన పోలీసు