Yadadri Temple To Reopen : తెలంగాణ వైకుంఠం.. యాదాద్రి టెంపుల్ సిటీ పునః ప్రారంభానికి వేగంగా అడుగులు పడుతున్నాయి. ఈ నెల 28న ప్రధానాలయంలో మహాకుంభ సంప్రోక్షణ నిర్వహించనున్నారు. అదే రోజు మిథునలగ్న సుముహూర్తంలో మహాకుంభాభిషేకం నిర్వహించనున్నారు ఆలయ అర్చకులు. ఈ నెల 21న మహాకుంభ సంప్రోక్షణకు అంకురార్పణ జరుగుతుంది. 21 నుంచి 28 వరకు పాంచరాత్రాగమ పద్ధతిలో ఉద్ఘాటన పూజలు నిర్వహించనున్నారు వేదపండితులు. బాలాలయంలో ఉద్ఘాటన పూజల నేపథ్యంలో శుక్రవారం నుంచి ఆర్జిత సేవలు నిలిపివేయనున్నారు.
Read More : Yadadri Temple : ఏప్రిల్ 25న యాదాద్రిలో శివాలయం తిరిగి ప్రారంభం
మహాకుంభ సంప్రోక్షణకు 10 రోజుల గడువే ఉండటంతో పెండింగ్లో ఉన్న పనులను వేగవంతం చేశారు అధికారులు. కొండపైన ప్రధాన ఆలయ సప్త రాజగోపురాలు, అష్టభుజి ప్రాకార మండపంతో పాటు బ్రహ్మోత్సవ మండపం, శివాలయంపై సుమారు 126 సువర్ణమయ కలశాలను ప్రతిష్టించే ఏర్పాట్లు చేస్తున్నారు. అష్టభుజి ప్రాకార మండపంపై ఇత్తడి చువ్వలు అమర్చారు. ప్రధానాలయంలో గర్భగుడి ముఖద్వారానికి స్వర్ణతాపడం చేసి తలుపుల బిగింపు పూర్తయింది.
Read More : Yadadri : చరిత్రలో సుస్థిరంగా నిలిచిపోయేలా యాదాద్రి
గర్భగుడికి అభిముఖంగా ఉన్న ధ్వజస్తంభం, బలిపీఠాలకు బంగారు తొడుగుల పనులు జరుగుతున్నాయి. ప్రధాన ఆలయం గర్భగుడి ముఖద్వారం పక్కన ఉన్న రాతి గోడలకు ఆధ్యాత్మిక సొబగులు దిద్దే పనులు కొనసాగుతున్నాయి. విమాన గోపురంతో పాటు ఆలయంలోని అన్ని కట్టడాలు పూర్తిగా స్వర్ణమయం చేయాలన్న సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. కొండపైన బస్బే, సెంట్రల్ కంట్రోల్ రూమ్, భారీ స్వాగత తోరణంతో పాటు రెండు ఘాట్రోడ్లను అనుసంధానం చేస్తూ నిర్మిస్తున్న ప్లైఓవర్ల పనులను శరవేగంగా జరుగుతున్నాయి. ఆలయ మొదటి ఘాట్రోడ్డును 36 అడుగులకు విస్తరించే పనులు కొనసాగుతున్నాయి. కొండపైన ఈశాన్య దిశలోని దర్శన క్యూకాంప్లెక్స్ నిర్మాణం పూర్తి కాగా, భక్తులకు మౌలిక వసతుల కల్పన పనులు కొనసాగుతున్నాయి.