Rohit Sharma On ODI Squad : అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు భారత్ వేదికగా జరగనున్న ప్రతిష్టాత్మక వన్డే ప్రపంచకప్ (ODI World Cup) కోసం భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (BCCI) భారత జట్టును ప్రకటించింది. ఆసియా కప్కు ఎంపిక చేసిన జట్టులోంచి 15 మందిని ఎంపిక చేశారు. ఆసియాకప్కు ఎంపిక అయిన సంజు శాంసన్, ప్రసిద్ధ్ కృష్ణ, తిలక్ వర్మలకు ప్రపంచకప్ జట్టులో చోటు దక్కలేదు. వీరితో పాటు సీనియర్ ఆటగాడు శిఖర్ ధావన్, స్పిన్నర్ చహల్కు సైతం అవకాశం రాలేదు.
జట్టును ప్రకటించిన అనంతరం టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) మీడియాతో మాట్లాడాడు. ప్రస్తుతం తమ దృష్టి మొత్తం ప్రపంచకప్ను గెలవడంపైనే కేంద్రీకృతమై ఉందన్నారు. భారత జట్టుకు ఆడుతున్న క్రికెటర్ల నుంచి అత్యుత్తమైన 15 మందిని ఎంపిక చేసుకున్నట్లు వెల్లడించారు. బ్యాటింగ్లో డెప్త్ ఉందని, నాణ్యమైన స్పిన్నర్లు అందుబాటులో ఉన్నారన్నారు. ఇతర బౌలింగ్ ఆప్షన్లు ఉన్నట్లు చెప్పుకొచ్చాడు.
జట్టుకు మేలు చేసే విధంగా నిర్ణయాలు ఉంటాయన్నారు. ప్రపంచకప్లో బరిలోకి దిగే సందర్భంలో ఒత్తిడి ఉంటుందా..? అన్న ప్రశ్నకు ఎలాంటి ఒత్తిడి లేదన్నాడు. మైదానంలో బరిలోకి దిగిన తరువాత అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చేందుకే కృషి చేస్తామని వెల్లడించాడు.
ఇక దృష్టి మొత్తం ప్రపంచకప్ పై మాత్రమే ఉందని, ఇక నుంచైనా బయట మాట్లాడే మాటల గురించి తనను ప్రపంచకప్ ప్రెస్కాన్ఫరెన్స్లో అడరని ఆశిస్తున్నట్లు చెప్పాడు. ఎందుకంటే ఇకపై తాను వాటికి సమాధానం ఇవ్వనని అన్నాడు. ‘మేము ప్రొఫెషనల్స్. మేమేం చేయాలో నాతో పాటు మా ఆటగాళ్లు అందరికి కూడా తెలుసు.’ దయచేసి అనవసర విషయాల గురించి ప్రస్తావించవద్దని రోహిత్ కోరాడు.
వన్డే ప్రపంచ కప్కు భారత జట్టు ఇదే..
రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్య (వైస్ కెప్టెన్), శ్రేయాస్ అయ్యర్, ఇషాన్ కిషన్, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, జస్ప్రిత్ బుమ్రా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్.
Team India: వన్డే ప్రపంచకప్ కు భారత్ జట్టు ప్రకటన.. ఎవరెవరు ఉన్నారంటే?