CM KCR: రాఖీ పండుగ వేళ తెలంగాణ ప్రభుత్వం వీవోఏలకు గుడ్న్యూస్ చెప్పింది. రాష్ట్ర వ్యాప్తంగా ఐకేపీ మహిళా సంఘాల్లో పనిచేస్తున్న వీవోఏలకు జీతాలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. రాఖీ పండుగ గిఫ్ట్గా వారి వేతనాలను 8వేలకు పెంచింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్న 17వేల608 మంది ఐకేపీ మహిళా సంఘాల సహాయకులకు లబ్ధి జరగనుంది. ఈ పెంపుతో రాష్ట్ర ఖజానాపై 106 కోట్ల అదనపు భారం పడనుంది. దీనికి సంబంధించి ప్రభుత్వం జీవో జారీ చేసింది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హయాంనుంచే వీవోఏలు గ్రామాల్లో పొదుపు సంఘాలకు సహాయకులుగా పనిచేస్తూ వస్తున్నారు. ఆయా సంఘానికి సంబంధించిన ఆర్థిక పరమైన అంశాలు, తదితర సమాచారాన్ని నోట్బుక్లో నమోదు చేస్తారు. ఆయా మహిళా సంఘాలు.. గ్రూప్ లీడర్కు కేవలం నెలకు రెండు వేల రూపాయలు గౌరవ వేతనం ఇస్తున్నారు. అయితే.. పొదుపు సంఘాల మహిళలను సంఘటితం చేస్తూ, వారిని చైతన్య పరుస్తూ సమన్వయ కర్తలుగా బాధ్యతలు నిర్వహిస్తున్న వీవోఏల కృషిని గుర్తించిన ప్రభుత్వం ఇప్పటివరకూ వారికి 3000 రూపాయల గౌరవవేతనంగా అందించింది. దీంతోపాటు మహిళా సంఘాలు రెండు వేలు అందించేవి. ప్రభుత్వం ఇచ్చేది, మహిళా సంఘాలు ఇచ్చేది కలుపుకుని వారికి మొత్తం 5000 రూపాయలు ఇప్పటివరకూ అందింది. ఇప్పుడు సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయంతో వీరి వేతనం 8 వేలకు పెరిగింది. ఇలా పెంచిన జీతాలు.. సెప్టెంబర్ నెల నుంచి వీరికి అమలు కానున్నాయి.
Bandi Sanjay Fires on CM KCR : నటనలో కేసీఆర్ను మించిన వారు లేరంటూ మండిపడ్డ బండి సంజయ్
వీవోఏల జీతాలు పెంచడంతోపాటు.. వారు చేస్తున్న మరిన్ని డిమాండ్లకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. వీవోఏలకు యూనిఫాంకోసం నిధులను అందించడంతోపాటు.. ప్రతిమూడు నెలలకోసారి అమలవుతున్న రెన్యువల్ విధానాన్ని సవరిస్తూ దీనిని ఏడాదికి పెంచుతూ నిర్ణయం తీసుకుంది. వీవోఏలకు రైతు భీమా మాదిరిగా జీవిత బీమా ఇచ్చేందుకు సానుకూలంగా ప్రభుత్వం స్పందించింది. స్పందించిన సీఎం కేసీఆర్ దీనికి సంబంధించిన విధి విధానాలను అధ్యయనం చేసి నివేదిక అందించాలని పంచాయతీ రాజ్శాఖకు అదేశించారు. దీంతో కేసీఆర్ సర్కార్ తీసుకున్న నిర్ణయంతో వీవోఏలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.