Governor Tamilisai: తెలంగాణ ప్రభుత్వంపై గవర్నర్ తమిళిసై సౌదరరాజన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. నా ఫోన్ ట్యాప్ అవుతున్నట్లు అనుమానాలు ఉన్నాయని, నా ప్రైవసీని దెబ్బతీయాలని చూస్తున్నారంటూ ఆరోపించారు. ఎలాంటి అనైతిక కార్యక్రమాలకు నేనే పాల్పడలేదని, ప్రగతిభవన్లా కాకుండా రాజ్ భవన్ తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని తమిళిసై అన్నారు.
ఫామ్హౌజ్ కేసులోనూ రాజ్భవన్ను లాగాలని చూశారని, అధికారిక ట్విటర్ ఖాతాలో డైరెక్ట్గా ఈ విషయాన్ని పెట్టారని తమిళిసై తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు. గతంలో తుషార్ రాజ్భవన్లో ఏడీసీగా పనిచేశారని, తుషార్ పేరును ఉద్దేశపూర్వకంగానే తీసుకొచ్చారని విమర్శించారు. ఏ విషయంపై అయినా మాట్లాడేందుకు సిద్ధమని తమిళిసై స్పష్టం చేశారు. ప్రభుత్వం నుంచి కొన్ని బిల్లులు వచ్చాయి. ఒక్కొక్క బిల్లును సమగ్రంగా పరిశీలిస్తున్నా. రిక్రూట్మెంట్ బిల్లుపై ప్రభుత్వాన్ని క్లారిఫికేషన్ కోరా.. కానీ రిక్రూట్మెంట్ను అడ్డుకుంటున్నట్లుగా ప్రచారం జరిగిందని అన్నారు.
కొత్తగా రిక్రూట్మెంట్ బోర్డు ఎందుకు అన్నదే నా ప్రశ్న అన్నారు. ఎనిమిదేళ్లుగా అనేక వీసీ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, ఈ విషయంపై అన్ని యూనివర్సిటీల వీసీలతో మాట్లాడానని తమిళిసై తెలిపారు. ఆ తర్వాత డీటైల్డ్ రిపోర్ట్ రూపొందించి ప్రభుత్వానికి పంపానన్నారు. కొత్త రిక్రూట్మెంట్ బోర్డు ఏర్పాటుతో ఎలాంటి ఇబ్బందులు వస్తాయి? యూజీసీ నిబంధనలకు లోబడి ఉంటుందా? లీగల్గా ఇబ్బందులు వస్తే ఏంటి పరిస్థితి? మళ్లీ నియమాకాలు ఉంటాయా? బోర్డు ఏర్పాటులో ఎలాంటి ప్రోటోకాల్ పాటిస్తారు? అని వివరణ కోరానని, కానీ, మంత్రి సమాచారం రాలేదని చెప్పడం నన్ను ఆశ్చర్యానికి గురిచేసిందని గవర్నర్ తెలిపారు. ఎనిమిదేళ్లుగా వీసీలను నియమించకపోతే ఐకాస ఎందుకు ఆందోళన చేయలేదని, ఒక్క నెల నా వద్ద ఆగిపోగానే ఎందుకు ఆందోళన చేస్తున్నారంటూ గవర్నర్ ప్రశ్నించారు. బిల్లులు పంపించగానే ఆమోదించడం మాత్రమే నా విధి కాదు, నేను ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నానని ప్రచారం చేయడం సబబు కాదంటూ గవర్నర్ అన్నారు.