CrowdStrike CEO says Windows BSOD is not a cyber attack ( Image Source : Google )
Microsoft Server Down : మైక్రోసాఫ్ట్ విండోస్ బ్రేక్ డౌన్ అయింది. ప్రపంచవ్యాప్తంగా ఒక్కసారిగా విండోస్ సర్వీసులు స్తంభించిపోయాయి. వేలాది కంప్యూటర్లు క్రాష్ అయ్యాయి. విండోస్ అందించే ఆపరేటింగ్ సిస్టమ్స్ చాలావరకూ బ్లూ స్ర్కీన్ ఇష్యూను ఎదుర్కొన్నాయి. ఈ శుక్రవారం (జూలై 19)న క్రౌడ్స్ట్రైక్ ద్వారా మైక్రోసాఫ్ట్ విండోస్, సైబర్ సెక్యూరిటీ ప్రోగ్రామ్తో నడుస్తున్న వేలాది కంప్యూటర్లు సాంకేతిక లోపంతో తీవ్ర అంతరాయాన్ని ఎదుర్కొన్నాయి. ఫలితంగా బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ (BSOD) ఏర్పడింది.
ఈ సమస్యను పరిష్కరించడానికి విమానయాన సంస్థలు, విమానాశ్రయ అధికారులు, బ్యాంకులు, ప్రభుత్వ సంస్థలు, ప్రైవేట్ కంపెనీలు, మునిసిపల్ అధికారులు ప్రయత్నాలు మొదలుపెట్టాయి. ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది వినియోగదారులను ఈ బగ్ ఇష్యూ తీవ్రంగా ప్రభావితం చేసింది. విండోస్ అంతరాయంతో చాలామంది దీనిని సైబర్ ఎటాక్ అంటూ ఆపాదిస్తున్నారు. దీనిపై స్పందించిన క్రౌడ్ స్ట్రైక్ సీఈఓ ఒక కీలక ప్రకటన విడుదల చేశారు. విండోస్ కంప్యూటర్లు బగ్ కారణంగానే గ్లిచింగ్ అవుతున్నాయి తప్పా.. అది సైబర్ దాడి కాదని తేల్చి చెప్పేశారు.
విండోస్ వెంటనే అప్డేట్ చేసుకోండి :
అంతేకాదు.. బగ్ ఇష్యూ రిపోర్టు చేసిన కొన్ని గంటల తర్వాత క్రౌడ్ స్ట్రైక్ సీఈఓ జార్జ్ కర్ట్జ్ ట్విట్టర్ (X) వేదికగా వివరణ ఇచ్చారు. “విండోస్ హోస్ట్ల కోసం సింగిల్ కంటెంట్ అప్డేట్లో సాంకేతిక లోపం కారణంగా ప్రభావితమైన కస్టమర్లతో క్రౌడ్స్ట్రైక్ చురుకుగా పనిచేస్తోంది. మ్యాక్ (Mac), లైనెక్స్ (Linux) హోస్ట్లు ప్రభావితం కావు. వాస్తవానికి ఇది సైబర్ దాడి కానే కాదు.. కేవలం ఒక బగ్ ఇష్యూ మాత్రమే..
CrowdStrike is actively working with customers impacted by a defect found in a single content update for Windows hosts. Mac and Linux hosts are not impacted. This is not a security incident or cyberattack. The issue has been identified, isolated and a fix has been deployed. We…
— George Kurtz (@George_Kurtz) July 19, 2024
ఆ బగ్ సమస్యను గుర్తించాం. దాన్ని సపరేట్ చేశాం. ఇష్యూ ఫిక్స్ చేశాం. లేటెస్ట్ అప్డేట్ల కోసం కస్టమర్లను సపోర్ట్ పోర్టల్ను విజిట్ చేయండి. లేదంటే.. మా వెబ్సైట్లో ఫుల్ అప్డేట్స్ అందిస్తున్నాం. వినియోగదారులు వెంటనే వాటితో విండోస్ అప్డేట్ చేసుకోవాలని సిఫార్సు చేస్తున్నాం. అధికారిక మార్గాల ద్వారా క్రౌడ్స్ట్రైక్ ప్రతినిధులతో తిరిగి కమ్యూనికేట్ చేస్తున్నాం” అని సీఈఓ జార్జ్ అన్నారు.
బగ్ ఇష్యూనే అసలు కారణం :
క్రౌడ్స్ట్రైక్ అనేది పెద్ద సంస్థలు, ప్రభుత్వాలకు సైబర్ సెక్యూరిటీ టూల్స్ అందించే సైబర్ సెక్యూరిటీ కంపెనీ. ఈ కంపెనీ అమెరికా ప్రభుత్వ సంస్థలతో సన్నిహిత సంబంధాలను కలిగి ఉంది. తత్ఫలితంగా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక ప్రభుత్వ సంస్థలు, కీలక సంస్థలు సర్వీసులను వినియోగించుకుంటున్నాయి. ఈ కొత్త అప్డేట్ విండోస్ కంప్యూటర్లలో బగ్ ఇష్యూకు దారితీసింది. ఫలితంగా విమానాశ్రయాలు, ఇతర పెద్ద క్లిష్టమైన సర్వీసులను నడిపే కంపెనీలు సైతం తీవ్ర ప్రభావితమయ్యాయి.
రాబోయే రోజుల్లో దీనిపై ఫుల్ క్లారిటీ రానుంది. ప్రస్తుతానికి ఫాల్కన్ అనే కంపెనీ సాఫ్ట్వేర్కు క్రౌడ్స్ట్రైక్ (CrowdStrike) జారీ చేసిన అప్డేట్ కారణంగా విండోస్ సిస్టమ్లు క్రాష్ అయినట్టుగా తెలుస్తోంది. కంపెనీ తాత్కాలిక, మాన్యువల్ పరిష్కారాన్ని కూడా అందించింది. కంపెనీ షేర్ చేసిన నోట్ ప్రకారం.. క్రౌడ్స్ట్రైక్ కస్టమర్లు తమకు తామే ఈ బగ్ ఇష్యూను ఫిక్స్ చేయగలరని సూచించింది.
విండోస్ ఇలా బూట్ చేయండి :
1. (Windows)ను సేఫ్ మోడ్ లేదా (WRE)లోకి బూట్ చేయండి.
2. C:\Windows\System32\drivers\CrowdStrikeకి వెళ్లండి
3. “C-00000291*.sys” ఫైల్ను గుర్తించి డిలీట్ చేయండి.
4. నార్మల్ బూట్ చేయండి.
చాలా మంది ఐటి నిపుణులు విండోస్ అంతరాయాన్ని చరిత్రలోనే అతిపెద్ద ఐటీ అంతరాయంగా పిలుస్తున్నారు. పలువురు సెక్యూరిటీ నిపుణులు ఎక్స్ వేదికగా వరుస ట్వీట్లు చేస్తున్నారు. బగ్ ఇష్యూ కారణంగా ప్రపంచవ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ విండోస్ సర్వీసులు నిలిచిపోవడం ఆర్థికంగా ఎంత ప్రభావం చూపింది అనేది ఇప్పుడే అంచనా వేయలేమన్నారు.