Government In Touch With Microsoft Over Outage
Microsoft Outage CERT Advisory : ప్రపంచవ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ సర్వీసులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మైక్రోసాఫ్ట్ సెక్యూరిటీ సిస్టమ్లో సాంకేతిక లోపం తలెత్తింది. దాంతో విండోస్ బ్లూ స్ర్కీన్ సమస్యను ఎదుర్కొంటుంది. అనేక మంది విండోస్ వినియోగదారులు క్రౌడ్ స్ట్రైక్ బగ్ సమస్యను ఎదుర్కొంటున్నారు.
ప్రపంచవ్యాప్తంగా గందరగోళానికి దారితీసింది. భారత్ సహా అమెరికా ఇతర దేశాల్లోని విమాన సర్వీసులు కూడా స్తంభించిపోయాయి. మన దేశంలో ఢిల్లీ, బెంగళూరు, ముంబై విమానాశ్రయాలలో విమానాల సర్వీసులకు కూడా తీవ్ర అంతరాయం కలిగింది. షెడ్యూల్ కన్నా ఆలస్యంగా విమానాలు నడుస్తున్నాయి.
ఒక్కసారిగా తలెత్తిన ఈ సాంకేతిక లోపంపై భారత ప్రభుత్వం మైక్రోసాఫ్ట్ను సంప్రదించింది. ఇతర దేశాల ప్రభుత్వాలు కూడా ఎమర్జెన్సీ మీటింగ్స్ ఏర్పాటు చేశాయి. ఈ క్రమంలోనే మైక్రోసాఫ్ట్ విండోస్ బగ్ ఇష్యూపై కేంద్ర ప్రభుత్వం కూడా దృష్టి సారించింది.
బగ్ ఇష్యూ ఫిక్స్ చేస్తున్నాం.. అప్డేట్ రిలీజ్ చేశాం : కేంద్ర ఐటీ మంత్రి
ప్రభుత్వ వర్గాల ప్రకారం.. మైక్రోసాఫ్ట్ బగ్ సమస్యపై అందరికి అవగాహన కల్పించినట్లు తెలుస్తోంది. ఈ విషయంలో ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ అడ్వైజరీని కూడా జారీ చేసింది. కేంద్ర ఐటీ మంత్రి, అశ్విని వైష్ణవ్, మైక్రోసాఫ్ట్ సాంకేతిక లోపంపై ఎక్స్ వేదికగా స్పందించారు.
ప్రపంచవ్యాప్త అంతరాయానికి సంబంధించి ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (MEITY ) మైక్రోసాఫ్ట్, ఇతర అనుబంధ సంస్థలతో టచ్లో ఉందని ఆయన అన్నారు. అంతరాయానికి కారణాన్ని గుర్తించామని, సమస్యను త్వరితంగా పరిష్కరించడానికి అప్డేట్స్ విడుదల చేసినట్లు కేంద్ర మంత్రి వైష్ణవ్ ధృవీకరించారు. ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT-In) కూడా ఈ విషయంపై సాంకేతిక సలహాను జారీ చేసింది.
MEITY is in touch with Microsoft and its associates regarding the global outage.
The reason for this outage has been identified and updates have been released to resolve the issue.
CERT is issuing a technical advisory.
NIC network is not affected.
— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) July 19, 2024
క్రౌడ్ స్ట్రైక్ ఏజెంట్ ఫాల్కన్ సెన్సార్ సంబంధిత విండోస్ హోస్ట్లు అందుకున్న అప్డేట్ కారణంగా మైక్రోసాఫ్ట్ సర్వీసులకు అంతరాయం, విండోస్ సిస్టమ్స్ క్రాష్ అవుతున్నాయని నివేదించింది. విండోస్ హోస్ట్లు ఫాల్కన్ సెన్సార్కు సంబంధించిన బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ (BSOD) ఎదుర్కొంటున్నాయని CERT అడ్వైజరీలో పేర్కొంది.
ఈ బగ్ సమస్యను పరిష్కరించడానికి వినియోగదారులు తమ సిస్టమ్ సేఫ్ మోడ్లో విండోస్ బూట్ చేయాలని సూచించింది. ఆ తర్వాత క్రౌడ్ స్ట్రైక్ డైరెక్టరీకి వెళ్లి బగ్ ఉన్న ఫైల్ డిలీట్ చేయాలని సూచించింది. అనంతరం నార్మల్గానే విండోస్ బూట్ చేయాలని వెల్లడించింది.