Ather 450 EV Scooter : ప్రస్తుత రోజుల్లో ఆన్లైన్ పేమెంట్లపైనే ఎక్కువగా ఆధారపడుతున్నారు. ఏది కొనుగోలు చేయాలన్నా నిమిషాల్లో డిజిటల్ పేమెంట్ చేసేస్తున్నారు. లిక్విడ్ క్యాష్ ఇచ్చి పేమెంట్ చేసేవారు చాలా తక్కువ అనే చెప్పాలి. అందులోనూ అచ్చం నాణేలను లక్షల్లో పొగేసేవారు చాలా అరుదుగా ఉంటారు. సాధారణంగా ఎవరైనా వాహనం కొనేందుకు షోరూంకు వెళ్లి ఈఎంఐలో కొనుగోలు చేస్తారు.
లేదంటే.. లిక్విడ్ క్యాష్ పెద్ద నోట్లతో కొనుగోలు చేస్తుంటారు. కానీ, రాజస్థాన్లోని జైపూర్కు చెందిన ఓ కస్టమర్ మాత్రం అందరిలా కాకుండా కొంచెం కొత్తగా ఆలోచించాడు. ఎలక్ట్రిక్ స్కూటర్ కొనేందుకు పెద్ద మొత్తంలో డబ్బులను కూడబెట్టాడు. నోట్లు కాదండోయ్.. అన్ని చిల్లర నాణేలే.. గతంలోనూ ఇలాంటి ఘటనలు వెలుగులోకి వచ్చాయి.
కంపెనీ సీఈఓ పోస్టు వైరల్ :
అలాంటిదే జైపూర్ చెందిన కస్టమర్ అన్ని రూ.10 నాణేలతో కలిపి లక్ష విలువైన ఏథర్ ఎనర్జీ 450 ఎలక్ట్రిక్ స్కూటర్ కొనేశాడు. ఈ విషయాన్ని స్వయంగా ఏథర్ ఎనర్జీ కంపెనీ సీఈఓ తరుణ్ మెహతా ట్విట్టర్ (X) వేదికగా పోస్టు చేయడంతో వైరల్ అవుతోంది. జైపూర్ కస్టమర్ అన్ని రూ. 10 నాణేలు చెల్లించి ఏథర్ 450 ఎలక్ట్రిక్ స్కూటర్ను కొనుగోలు చేశాడని కంపెనీ సీఈఓ వెల్లడించారు. అయితే, ఆ వ్యక్తి ఎవరు అనేది? ఏ మోడల్ స్కూటర్ కొనుగోలు చేశాడు అనేది రివీల్ చేయలేదు. ఇంతకీ, ఆ కస్టమర్ రూ. 10 నాణేలతోనే ఈవీ స్కూటర్ను ఎందుకు కొన్నాడు అనేది కూడా వెల్లడించలేదు.
A new Ather owner just bought himself a 450 in Jaipur
… all with 10Re coins! pic.twitter.com/VWoOJiQey2
— Tarun Mehta (@tarunsmehta) February 17, 2024
ఏథర్ 450 సిరీస్ ధరలు ఇవే :
ఇప్పటికే భారత మార్కెట్లో ఏథర్ ఎనర్జీ 450 సిరీస్లో మొత్తం మూడు ఎలక్ట్రిక్ స్కూటర్లను ప్రవేశపెట్టింది. అందులో ఏథర్ 450ఎస్, 450ఎక్స్, 450 అపెక్స్ అనే మూడు స్కూటర్లను విక్రయిస్తోంది. ఏథర్ 450ఎస్ మోడల్ ధర రూ.1.10 లక్షలుగా ఉంది. ఏథర్ 450 అపెక్స్ మోడల్ ధర రూ.1.89 లక్షలకు విక్రయిస్తోంది.
అతి త్వరలో ఏథర్ ఎనర్జీ మరో కొత్త రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ చేసేందుకు ప్లాన్ చేస్తోంది. రాబోయే ఈ రిజ్టా స్కూటర్ పెద్ద సీటు పరిమాణంతో రానుంది. ఏథర్ స్కూటర్లకు మార్కెట్లో మంచి డిమాండ్ పెరిగిన నేపథ్యంలో ఈ తరహా స్కూటర్లను మార్కెట్లోకి విడుదల చేసేందుకు కంపెనీ ప్లాన్ చేస్తోంది.