మహిళల పట్ల ఆయన వ్యవహరిస్తున్న తీరు తాలిబన్లను తలపిస్తోంది: మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి

సీఎం చేసిన వ్యాఖలపై చెప్పుకునే అవకాశం సభలో సబితకు ఇవ్వలేదని అన్నారు.

BRS MLAs: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరు ఓ ఫ్యూడలిస్ట్‌లా ఉందంటూ మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి మండిపడ్డారు. మహిళల పట్ల ఆయన వైఖరి తాలిబన్లను తలపిస్తోందని విమర్శించారు. గతంలో డీకే అరుణ గురించి అలాగే మాట్లాడారని, సీనియర్ మహిళా నేతల పట్ల సీఎం చేసిన వ్యాఖ్యలు జుగుప్సాకరమని చెప్పారు. జగదీశ్ రెడ్డితో కలిసి హైదరాబాద్ లోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు.

సీఎం చేసిన వ్యాఖలపై వివరణ ఇచ్చుకునే అవకాశం శాసనసభలో సబితకు ఇవ్వలేదని, తాము నిరసన వ్యక్తం చేసినా పట్టించుకోలేదని తెలిపారు. అన్ని పార్టీలకు అవకాశం ఇచ్చినప్పటికీ తమ పార్టీ మహిళా సభ్యులకు అవకాశం ఇవ్వలేదని చెప్పారు. దాదాపు 4.30 గంటల పాటు తాము నిరసన తెలిపినా స్పందించలేదని తెలిపారు. తాము ఎస్సీ, ఎస్టీ వర్గీకరణను స్వాగతిస్తున్నామని ప్రశాంత్ రెడ్డి అన్నారు.

నాపై తాగుబోతు మంత్రిని రెచ్చగొట్టారు: జగదీశ్ రెడ్డి
అసెంబ్లీలో తమ పార్టీ మహిళా ఎమ్మెల్యేలు నిన్న ఒక్క మాట కూడా మాట్లాడలేదని జగదీశ్ రెడ్డి అన్నారు. సీఎం రేవంత్ దారికాచి దోపిడీ చేసినట్లు ఒక్కసారిగా మహిళా ఎమ్మెల్యేలపై దాడి చేశారని చెప్పారు. రాష్ట్రంలోని జరుగుతున్న ఘటనలపై సబితా అసెంబ్లీలో మాట్లాడితే కాంగ్రెస్ జీర్ణించుకోలేకపోతోందని దుయ్యబట్టారు. మంత్రులు, ఎమ్మెల్యేల అనుచరులే దోషులుగా ఉంటున్నట్లు సమాచారం వస్తుందని చెప్పారు. కేసీఆర్‌ను విమర్శించేందుకే రేవంత్ శాసనసభను ఉపయోగించుకుంటున్నారని అన్నారు. తనపై తాగుబోతు మంత్రిని రెచ్చగొట్టారని, శాసనసభకు కూడా ఆ మంత్రి తాగే వస్తారని ఆరోపించారు.

Also Read: అతనికి కీలుబొమ్మగా బతకాల్సిన అవసరం నాకులేదు.. : మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి

ట్రెండింగ్ వార్తలు