Tea Mosquito : వాణిజ్య పంటల్లో ముఖ్యమైనది జీడిమామిడి. జీడిమామిడిలో చీడపీడల వల్ల బాగా నష్టం వాటిల్లుతుంది. వేరు తొలిచే పురుగు తరువాత అంతటి నష్టం కలిగించేది తేయాకు దోమ. పూత దశ మొదలు పంట చేతికందే వరకు తేయాకు దోమ పంటను ఆశించి నష్టాన్ని కలిగిస్తుంది. దీని వల్ల పక్వానికి రాకుండానే గింజలు రాలిపోతాయి. గింజలపై మచ్చలు, చారలు ఏర్పడి నాసిరకంగా తయారవుతాయి. చెట్టు పాలిపోయి కనిపిస్తుంది.
ఈ దోమ చిరుదశలో, తల్లి దశలో లేత కొమ్మలపై , రెమ్మలపై వాలి వాటి రసాన్ని పీల్చుకుంటాయి. దీని వల్ల ఎర్రని జిగురాలాంటి పదార్ధాం కారుతూ నల్లని చారలు ఆకులపై ఏర్పడతాయి. పూత దశ ప్రారంభంలో ఉండగానే ఈ తేయాకు దోమను గుర్తించాలి. వెంటనే నియంత్రణ చర్యలు చేపట్టాలి.
నివారణ చర్యలు ;
తేయాకు దోమ నివారణకు మూడుదశల్లో సస్యరక్షణ చేపట్టాలి. మొదటి దశలో చిగురాకు ఉన్న సందర్భంలో , రెండవది పూత దశలో, మూడవది గింజకట్టే దశలో ఇలా మూడు దశల్లో సస్యరక్షణ చర్యలు చేపట్టాల్సి ఉంటుంది.
ఈ తేయాకు దోమ జీవిత చక్రం 20 నుండి 30 రోజులు మాత్రమే ఉంటుంది. జీడి మామిడి చుట్టూ పాదులు చేసి కలుపులేకుండా చూడాలి. జనవరి మాసం ఈ దోమ ఉధృతి అధికంగా ఉంటుంది.
దీని నివారణకు ఎల్ సైహోలోథ్రిన్, ఎసిటామిప్రిడ్ థయామీ థాక్సమ్ మందులను తగు మోతాదులో పిచికారి చేయాలని వ్యవసాయశాఖ అధికారులు సూచిస్తున్నారు.