Kinjarapu Atchannaidu
TDP AP Chief Atchannaidu : ఆధారాలు లేకుండా స్కిల్ డెవలప్ మెంట్ కేసు వేశారు.. సంబంధం లేకున్నా ఫైబర్ నెట్, ఇన్నర్ రింగ్ రోడ్ అంశాల్లోనూ కేసులు పెట్టారంటూ వైసీపీ ప్రభుత్వంపై ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. నాటి ప్రభుత్వంలో తీసుకున్న విధాన నిర్ణయాల వల్ల ప్రజలకు చాలా మేలు జరిగిందని, కానీ, ప్రభుత్వం చేస్తున్న తప్పులను నిలదీస్తున్నందుకే చంద్రబాబును జుడీషియల్ కస్టడీలో పెట్టారని అచ్చెన్నాయుడు అన్నారు. మద్యం, భూములు, ఇసుక వంటి వాటిల్లో ప్రభుత్వం అడ్డగోలు దోపిడీకి పాల్పడిందని, ఇరిగేషన్ రంగాన్ని జగన్ నాశనం చేశారని విమర్శించారు.
వైసీపీ ప్రభుత్వం వైఫల్యాలపై చంద్రబాబు ప్రజల్లో చైతన్యం కలిగించడంతో సీఎం జగన్ లో భయం మొదలైందని, అందుకే అక్రమ కేసుతో జైలుకు పంపించారని అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్కిల్ కేసులో ఆధారాలు ఏవని అచ్చెన్నాయుడు ప్రశ్నించారు.స్కిల్ కేసులో ఎలాంటి ఆధారాల్లేవని నెల రోజుల తర్వాత ఏఏజీ చావు కబురు చెప్పారు. ఇప్పుడు ఇన్నర్ రింగ్ రోడ్డులో అవినీతి అంటూ కేసులు పెట్టారు. రింగ్ రోడ్డు లేదు.. బొంగు రోడ్డు లేదంటూ అచ్చెన్నాయుడు అన్నారు. ఐఆర్ఆర్ కేసులో లోకేశ్ ఉన్నారని గతంలో ప్రకటనలు చేశారు.
ముందస్తు బెయిల్ కోసం లోకేశ్ కోర్టుకెళ్తే.. ఆయనకేం సంబంధం లేదని ప్రభుత్వమే చెప్పింది. ఎలాంటి ఆధారాల్లేకుండా నెల రోజుల పాటు చంద్రబాబును జైల్లో పెట్టారు. గతంలో మాకు 160 స్థానాలు వస్తాయనుకునేవాళ్లం. కానీ, ఇప్పుడు జగన్ చేసిన తప్పులతో టీడీపీకి 175 స్థానాలు రావడం ఖాయమని క్లారిటీ వచ్చిందని అచ్చెన్నాయుడు అన్నారు.