AP politics : అంతటి వైసీపీ ప్రభంజనంలోనూ.. ఆ నియోజకవర్గంలో ఫ్యాన్ తిరగలేకపోయింది. వచ్చే ఎన్నికల్లోనైనా.. ఆ సీటును దక్కించుకునేందుకు.. అధికార వైసీపీ ఇప్పటి నుంచే రిపేర్లు మొదలుపెట్టింది. పార్టీ జెండా మోసిన లీడర్కి చాన్స్ ఇచ్చినా రిజల్ట్ లేకపోవడంతో.. సరైన మాస్ లీడర్ని రంగంలోకి దించలాని చూస్తోంది. ఫ్యాన్ ఐదో నెంబర్ మీద తిరిగితే ఎలా ఉంటుందో చూపించేందుకు.. పెద్ద వ్యూహామే రచించింది రాష్ట్ర నాయకత్వం. అందుకోసం.. సరైనోడితో చర్చించి.. టీడీపీ కంచుకోటను బద్దలుకొట్టి.. తమ అడ్డాగా మార్చుకోవాలని చూస్తోంది.
ఉమ్మడి ప్రకాశం జిల్లాలో.. పర్చూరు అంటే తెలుగుదేశానికి కంచుకోట. గత ఎన్నికల్లో జగన్ సునామిని తట్టుకొని మరీ.. ఈ సీటు గెలిచింది టీడీపీ. దీంతో.. కలగా మిగిలిన పర్చూరును.. ఈసారి ఎలాగైనా దక్కించుకోవాలనే పట్టుదలతో ఉంది రూలింగ్ పార్టీ. ఇందుకోసం.. స్థానికంగా పార్టీని గాడిన పెట్టడంతో పాటు వచ్చే ఎన్నికల్లో అక్కడ వైసీపీ జెండా ఎగరేసేందుకు.. మాస్ లీడర్ అవసరమని భావిస్తోంది వైసీపీ అగ్ర నాయకత్వం. ఇందుకోసం.. పర్చూరు బాధ్యతలను పక్కనే చీరాలలో ఉన్న ఆమంచి కృష్ణమోహన్కు అప్పగించి.. అక్కడి రాజకీయాన్ని తమవైపు తిప్పుకునే వ్యూహాన్ని సిద్ధం చేసింది.
Also read : Telangana Congress : తెలంగాణ కాంగ్రెస్ లో హాట్ టాపిక్గా స్ట్రాటజిస్ట్ సర్వే వ్యవహారం
వైసీపీ స్కెచ్ పాతదే అయినా.. చీరాలలో ఎమ్మెల్యే కరణం బలరాం కుటుంబం వైసీపీలోకి రావడంతో.. పర్చూరు ఇష్యూను పక్కనబెట్టారు. ఈ మధ్యే.. చీరాలలో కొండయ్య యాదవ్ను టీడీపీ ఇంచార్జ్గా పెట్టడంతో.. కరణం బలరాంపై నాయకత్వానికి ఓ క్లారిటీ వచ్చింది. చీరాల ఇంచార్జ్గా కరణం వెంకటేశ్కు బాధ్యతలు అప్పగించారు. అక్కడున్న ఆమంచిని పర్చూరుకు పంపాలని సీఎం జగన్ డిసైడ్ అయిపోయారు. దీనిపై.. తాడేపల్లి క్యాంప్ ఆఫీసులో.. జగన్ సమక్షంలో సజ్జల, విజయసాయి, వైవీ సుబ్బారెడ్డితో గంటన్నర పాటు సమావేశం జరిగింది. దీని తర్వాత.. పర్చూరుకు వెళ్లేందుకు ఆమంచి అంగీకరించినట్లు.. టాక్ వినిపిస్తోంది.
జిల్లాలోని కొండపి, అద్దంకి ఇంచార్జ్లను ఇప్పటికే ప్రకటించిన వైసీపీ.. పర్చూరు, చీరాల ఇంచార్జిలను త్వరలోనే ప్రకటించనుందని.. పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. దీని తర్వాత.. చీరాలలో అంతర్గత పోరుకు చెక్ పడటంతో పాటు పర్చూరులో నాయకత్వ సమస్యకు పరిష్కారం దొరుకుతుందని.. వైసీపీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. అయితే.. ప్రస్తుతం పర్చూరు ఇంచార్జ్గా ఉన్న రావి రామనాథం నాయకత్వంపై.. స్థానిక కేడర్ అసంతృప్తిగా ఉందనే టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే.. కేడర్ వర్గాలుగా విడిపోయిందనే చర్చ కూడా ఉంది. పరిస్థితులు ఇలాగే కొనసాగితే.. పర్చూరులో మరోసారి దెబ్బ తప్పదని భావించి.. వైసీపీ నాయకత్వం మార్పులు-చేర్పులకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఆమంచిని పర్చూరుకు తేవడం వెనుక.. పెద్ద స్కెచ్చే ఉందని.. లోకల్ వైసీపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
Also read : India : గోధుమల ఎగుమతి నిషేధంపై భారత్ సడలింపులు
మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ పెద్దల స్వగ్రామం చినగంజాం మండలంలోని సోపిరాల్ల. నియోజకవర్గంలో కమ్మ సామాజికవర్గం తర్వాత.. కాపులదే అతిపెద్ద ఓట్ బ్యాంక్. వీరికి తోడు.. వైసీపీ సానుభూతిపరులుగా ముద్ర ఉన్న మైనార్టీలు, దళితులు, రెడ్డి సామాజికవర్గం ఓటర్లు.. తమకు ప్లస్ అవుతారని వైసీపీ భావిస్తోంది. ఎవరి ఓట్లు వారికి చీలి.. దగ్గుబాటి వర్గం ఆమంచికి మద్దతిస్తే.. పసుపు కోటలో.. ఫ్యాన్ రీసౌండ్ ఖాయమని రూలింగ్ పార్టీ భావిస్తోంది.
అయితే.. ఇప్పుడున్న పరిస్థితుల్లో.. పర్చూరులో ఆమంచి గెలవడం అంత సులువేం కాదని.. స్థానికులు చర్చించుకుంటున్నారు. కేడర్లోని వర్గ పోరుకు చెక్ పెట్టడం, క్షేత్రస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయడమే.. ఇప్పడు కృష్ణమోహన్ ముందున్న బిగ్ టాస్క్. అంతేకాదు.. ఎంతోకొంత ప్రభావం చూపగల గొట్టిపాటి భరత్, ఇంచార్జ్ పదవి కోల్పోనున్న రావి రామనాథం.. ఆమంచికి ఏ మేరకు సహకరిస్తారన్న చర్చ కూడా నడుస్తోంది. వీటన్నింటిని.. కృష్ణమోహన్ ఎలా టాకిల్ చేస్తారన్నదే.. స్థానికంగా డిబేట్కు దారితీసింది. ఎంతో నమ్మకంతో.. తనను పర్చూరు గ్రౌండ్లోకి దించిన రాష్ట్ర నాయకత్వానికి.. ఆమంచి తన సత్తా చాటి.. పార్టీని గెలిపిస్తారా.. లేక.. చరిత్రను రిపీట్ చేస్తారా అన్నది.. ఆసక్తిగా మారింది. ఎందుకంటే.. చీరాల రాజకీయం చీరాలదే. పర్చూరు పాలిటిక్స్.. పర్చూరువే.