Prakash Javadekar Interesting comments on AP politicians : ఏపీలో చాలామంది నేతల బెయిల్ పై బయట ఉన్నారని..వారు త్వరలోనే జైలుకెళతారని బీజేపీ అగ్రనేత ప్రకాశ్ జవదేకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ బీజేపీ ఆధ్వర్యంలో విజయవాడలో ఏర్పాటు చేసిన ప్రజాగ్రహ సభకు హాజరైన సందర్భంగా జవదేకర్ తెలుగు రాష్ట్రాల్లో వైసీపీ, టీడీపీ, టీఆర్ఎస్… ఈ మూడు పార్టీలు కుటుంబ పార్టీలేనని విమర్శించారు. ఈ మూడు ప్రాంతీయ పార్టీలది అవినీతి పాలనే అంటూ తీవ్ర విమర్శలు చేశారు.
తాను కేంద్రమంత్రిగా ఉన్నప్పడు పోలవరం ప్రాజెక్టుకు అన్ని అనుమతులు వచ్చాయని కానీ ఏడేళ్లు అవుతున్నా ఈనాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి కాలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. రాజధాని విషయంలో టీడీపీ, వైసీపీ మధ్య ఘర్షణ నెలకొందని..ఈ రెండు పార్టీలు ప్రజలను మోసం చేశాయని..చేస్తునే ఉన్నాయని బీజేపీ ఒక్కటే ఏపీకి మేలు చేస్తుందని అన్నారు.
ఏపీలో చాలామంది నేతలు బెయిల్ పై బయట ఉన్నారని..బెయిల్ పై ఉన్న ఆ నేతలు త్వరలోనే జైలుకు వెళతారంటూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఏపీలో దేవాలయాలపై దాడులు జరుగుతున్నాయని ఈ దాడుల్ని బీజేపీ ఖండిస్తోందని తీవ్రంగా వ్యతిరేకిస్తోందని అన్నారు. అంతర్వేదిలో రథం దగ్ధం, రామతీర్థంలో స్వామివారి విగ్రహాన్ని విరగ్గొట్టారని మండిపడ్డారు. ప్రకాశ్ జవదేకర్ ఆంగ్లంలో ప్రసంగించగా ఏపీ బీజేపీ నేత పురందేశ్వరి తెలుగులో అనువదించారు.