ఏపీ ముఖ్యమంత్రి జగన్.. టీడీపీని ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. తమకు అధికారం దక్కలేదన్న అక్కసుతో.. చీకట్లో ఆలయాలపై దాడులు.. రథాలు తగలబెట్టడాలు.. సంక్షేమ పథకాలు అడ్డుకోవడం.. పిల్లలకు ఇంగ్లిష్ మీడయం అందకుండా కుట్రలు.. కోర్టుల్లో కేసులు వేయించి ఇళ్ల నిర్మాణాలు ఆపడం వంటి చర్యలకూ దిగుతున్నారని ఆరోపించారు. సీఎంను పట్టుకుని.. బోషిడీకే అంటూ అర్థాలు చెప్పలేని మాటలతో తిడుతున్నారని జగన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రజలు ఇదంతా గమనించాలని కోరారు.
విజయవాడలో జరిగిన పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవానికి ముఖ్యమంత్రి జగన్ హాజరయ్యారు. పోలీసుల సంక్షేమం విషయంలో తమ ప్రభుత్వం మంచి చర్యలు తీసుకుందన్నారు. వీకాఫ్ సౌకర్యం కల్పించిన విషయాన్ని గుర్తు చేశారు. నేరాల అదుపులో సమర్థంగా విధులు నిర్వర్తిస్తున్నారని ప్రశంసించారు. రూపు మారుతున్న నేరాల విషయంలో మరింత కచ్చితంగా వ్యవహరించాలని సూచించారు.
సంఘ విద్రోహ శక్తుల విషయంలో పోలీసులు ఏ మాత్రం అలసత్వం లేకుండా ఉండాలన్న సీఎం జగన్.. లా అండ్ ఆర్డర్ పరిరక్షణలో ఎవరికీ మినహాయింపు లేదన్నారు. మహిళలు, పిల్లలు, వృద్ధులు.. పౌరుల భద్రత విషయంలో పోలీసులు రాజీ పడవద్దని చెప్పారు. అసాంఘిక శక్తులు.. రాజకీయంగా ప్రభావం చూపిస్తున్న తీరును అంతా గమనించాలని.. తమకు, తమవాళ్లకు అధికారం దక్కలేదన్న కోపంతో తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు.
ప్రతిపక్షాల తీరును మున్సిపల్, జడ్పీటీసీ, బై ఎలక్షన్స్ సందర్భంగా చూశామని.. అయినా ప్రభుత్వానికి ప్రజల అండదండలు, దేవుడి దీవెనలు ఉన్నాయని సీఎం జగన్ అన్నారు. ప్రజల సంక్షేమం కోసం ఇలాగే పని చేస్తామని జగన్ చెప్పారు.