Dharmana Krishna Das : వ్యవసాయ బోర్లకు విద్యుత్ మీటర్ల అంశం హాట్ టాపిక్ గా మారింది. దీనిపై సర్వత్రా చర్చ జరుగుతోంది. వ్యవసాయ బోర్లకు విద్యుత్ మీటర్లు బిగించే ప్రసక్తే లేదని తెలంగాణ సీఎం కేసీఆర్ ఇప్పటికే ప్రకటించారు. కేంద్రం రూపొందించిన విద్యుత్ సంస్కరణలను కేసీఆర్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇక ఇదే విషయమై ఏపీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శ్రీకాకుళంలో వ్యవసాయ సలహా మండలి సమావేశంలో ధర్మాన కృష్ణదాస్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వ్యవసాయ బోర్లకు విద్యుత్ మీటర్ల అంశంపై తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు మనకు అనవసరం అని ఆయన అన్నారు. అంతేకాదు, వ్యవసాయ బోర్లకు మీటర్ల వల్ల రైతులకు ఒక్క రూపాయి నష్టం కూడా ఉండదని ఆయన తేల్చి చెప్పారు. జగన్ ప్రభుత్వంలో రైతులకు ఎలాంటి ఇబ్బంది ఉండదని, ఇది శిలాక్షరాలతో రాసుకోండి అని అన్నారు. జగన్ ఆధికారంలో ఉన్నంత వరకూ రైతులకు ఉచిత విద్యుత్ కొనసాగుతుందని డిప్యూటీ సీఎం తేల్చి చెప్పారు.
CM KCR : మోదీ మాట వినకుంటే తెలంగాణకు రూ.25వేల కోట్ల నష్టం..! అయినా తగ్గేదేలే-కేసీఆర్
ధాన్యం కొనుగోళ్లు ఆలస్యం కావడానికి రైతులకు అవగాహన లేకపోవడం ఒక కారణం అని వివరించారు. లేట్ వెరైటీలు పండించడం, పంట నూర్పిడి ఆలస్యం కావడం సమస్యగా మారుతున్నాయని చెప్పారు. మిల్లర్లకు సమయానికి ధాన్యం అందించలేకపోతున్నారని, ధాన్యం కొనుగోళ్లు ఆలస్యం అవుతోందని, రైతుల సమస్యలను సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్తామని డిప్యూటీ సీఎం తెలిపారు.
కాగా, వ్యవసాయ మోటర్లకు మీటర్ల విషయంలో కేంద్ర ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించారు తెలంగాణ సీఎం కేసీఆర్. దీని వల్ల రైతాంగం తీవ్రంగా నష్టపోతుందని, తెలంగాణలో అమలు చేసేది లేదని ఆయన తేల్చి చెప్పారు. ఏపీలో, ఇప్పటికే విద్యుత్ మీటర్లు బిగిస్తున్నారని ఇటీవల కేసీఆర్ అన్నారు. వ్యవసాయ మోటర్లకు మీటర్ల విషయంలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు భిన్నంగా ఏపీ డిప్యూటీ సీఎం చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.