Kottu Satyanarayana Allegations : కోనసీమ అల్లర్లపై మంత్రి కొట్టు సత్యనారాయణ స్పందించారు. ప్రతిపక్షాలపై ఆయన విరుచుకుపడ్డారు. జనసేన, టీడీపీ కుట్రలో భాగంగానే కోనసీమలో అల్లర్లు జరిగాయన్నారు. ఏపీలో శ్రీలంక లాంటి పరిస్థితి వస్తుందని చెప్పినప్పుడే అర్థమైందన్నారు. రాజకీయ లబ్ది కోసమే కోనసీమలో చంద్రబాబు అల్లర్లు చేయిస్తున్నారని ఆరోపించారు మంత్రి కొట్టు సత్యనారాయణ. ఒక ప్రాంతాన్ని ఎంచుకుని కుట్రలో భాగంగానే దాడులు చేశారని ఆయన మండిపడ్డారు. ఈ ఘటనలో ఎవరి ప్రమేయం ఉన్నా వదిలిపెట్టేది లేదన్నారు మంత్రి కొట్టు సత్యనారాయణ.
”ప్రశాంతతకు మారుపేరైన కోనసీమ జిల్లాలో విధ్వంసం జరగడం దురదృష్టకరం. రాజకీయ లబ్ధి కోసం ప్రతిపక్ష పార్టీలే ఈ విధ్వంసాన్ని సృష్టించాయి. ప్రజల అభీష్టం మేరకే కోనసీమ జిల్లా పేరును అంబేద్కర్ కోనసీమ జిల్లాగా మార్చాము. తెలుగుదేశం, జనసేన పార్టీలు సైతం అంబేద్కర్ పేరు పెట్టాలని కోరాయి. టీడీపీ, జనసేన అధినేతలు చంద్రబాబు, పవన్ కల్యాణ్ ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నారు. ఎంతో హుందాగా వ్యవహరించే కోనసీమ ప్రజలు ఇటువంటి విధ్వంసాలకు పాల్పడరు. కేవలం అరాచకం సృష్టించేందుకే అల్లర్లు సృష్టించారు. ప్రస్తుతం అమలాపురంలో ప్రశాంత వాతావరణం నెలకొంది. ప్రతిపక్ష పార్టీలు తమ మనుగడ కోసం ప్రజలను రెచ్చగొట్టొద్దు” అని కొట్టు సత్యనారాయణ విజ్ఞప్తి చేశారు.(Kottu Satyanarayana Allegations)
Konaseema Tension : కోనసీమ ప్రజలు సంయమనం పాటించాలి-చంద్రబాబు నాయుడు
ప్రశాంతతకు మారు పేరు కోనసీమ. అల్లర్లకు, హింసకు, విధ్వంసాలకు అక్కడ తావు లేదంటారు. అలాంటి కోనసీమ ఒక్కసారిగా అట్టుడికిపోయింది. రణ క్షేత్రంగా మారింది. నిరసనలు, ఆందోళనలతో హోరెత్తిపోయింది. హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి.
దీనంతటికీ కారణం.. జిల్లా పేరు మార్చడమే. అవును.. ఆంధ్రప్రదేశ్లో ఉన్న 13 జిల్లాలను 26 జిల్లాలుగా ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా కోనసీమ జిల్లాను ఏర్పాటు చేసింది ప్రభుత్వ. అంతా సవ్యంగా ఉన్న క్రమంలో.. కోనసీమ జిల్లా పేరును బీఆర్ అంబేద్కర్ జిల్లాగా మారుస్తూ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. ఇదే కోనసీమ వాసులకు ఆగ్రహం తెప్పింది. కోనసీమ జిల్లా పేరు మార్పు నిర్ణయం అగ్గి రాజేసింది.
కోనసీమనే ముద్దు.. మరే పేరు వద్దు అంటూ ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా కోనసీమ సాధన సమితి గళమెత్తింది. కోనసీమ జిల్లా పేరుని కొనసాగించాలనే డిమాండ్ తో భారీ ర్యాలీకి పిలుపునిచ్చింది. వందల సంఖ్యలో జనాలు తరలిరావడంతో పరిస్థితి అదుపు తప్పింది. కలెక్టరేట్ ముట్టడికి యువకులు, నిరసనకారులు ప్రయత్నించారు. కోనసీమ సాధన సమితి పిలుపు నేపథ్యంలో పోలీసులు అమలాపురం వ్యాప్తంగా 144 విధించారు. అమలాపురం మొత్తాన్ని అష్టదిగ్భంధనం చేశారు.
Pawan on Amalapuram: అమలాపురం ఉద్రిక్తతలపై స్పందించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్
అయినప్పటికీ వెనక్కి తగ్గలేదు నిరసనకారులు. ఒక దశలో పోలీసులతో తీవ్ర ఘర్షణకు దిగిన ఆందోళనకారులు.. వారిపై రాళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో 20 మందికిపైగా పోలీసులు గాయపడ్డారు. ఆ తర్వాత పోలీసులను తప్పించుకుని వచ్చిన ఆందోళనకారులు.. కలెక్టరేట్ వద్దకు చేరుకున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన టెంట్ ను ధ్వంసం చేశారు. ఒక్కసారిగా అన్నివైపుల నుంచి సుమారు 10వేల మంది ఆందోళనకారులు వచ్చేశారు. పోలీసులు లాఠీచారజ్ చేయడంతో ఒక్కసారిగా పరిస్థితి అదుపుతప్పింది. నిరసనలకారులు హింసకు దిగారు. ప్రభుత్వ భవనాలు, వాహనాలకు నిప్పు పెట్టారు. మంత్రి విశ్వరూప్, ఎమ్మెల్యే పొన్నాడ సతీశ్ ఇళ్లకు నిప్పు పెట్టారు. మూడు బస్సులను తగులబెట్టారు.