pawan kalyan Janasena praja court
pawan kalyan Janasena praja court : వినూత్న కార్యక్రమాలతో ముందుకెళుతున్న జనసేన (Janasena )పార్టీలో మరో కొత్త కార్యక్రమం చేపట్టనుంది. ప్రజాకోర్టు పేరుతో కార్యక్రమం చేపట్ట నున్నామని జనసేన అధినేత పవన్ కల్యాణ్ (pawan kalyan)తెలిపారు. మంగళగిరిలో జనసేన కార్యాలయంలో వీర మహిళలతో సమావేశమైన పవన్ త్వరలోనే ప్రజాకోర్టు (praja court)కార్యక్రమం చేపడతామని పవన్ కళ్యాణ్ వెల్లడించారు.సోషల్ మీడియాలో ను..అలాగే సందర్భానుసారంగా.. కొన్నిసార్లు బయట కూడా కార్యక్రమం చేపడతాం అని వివరించారు. ఎవరైతే తప్పులు చేస్తారో.. ప్రజాకోర్టులో ఏయే చట్టాల కింద వీరికి శిక్ష పడాలి? రాజ్యాంగంలో ఉల్లంఘన ఎలా జరుగుతుంది? అనే దానిపై కార్యక్రమం ఉంటుందన్నారు.
తప్పు జరిగినప్పుడు ప్రతిఘటించాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిది అంటూ పవన్ దిశానిర్ధేశం చేశారు. అటువంటి బాధ్యతలు తెలిసేవిధంగా తల్లిదండ్రులు కూడా పిల్లలకు నేర్పాలని సూచించారు.తాము అధికారంలోకి రాగానే మహిళలు, పిల్లలకు మరింత భద్రత కల్పిస్తామని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ భరోసా ఇచ్చారు. తన సోదరిని వేధిస్తున్నవారిని ప్రశ్నించినందుకు 14ఏళ్ల బాలుడిని హత్య చేసి పెట్రోల్ పోసి తగులబెట్టారని ఇటువంటి దరాగతాలకు పాల్పడేవారికి తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. సమాజంలో తప్పు చేసినవారిని ప్రశ్నించే గుణాన్ని అలవర్చుకోవాలని ఇది ప్రతీ ఒక్కరి బాద్యత అని అన్నారు. తప్పు చేస్తే శిక్ష పడాలని..మరోసారి తప్పు చేయకుండా ఉండేలా శిక్ష పడాలని అన్నారు.
ఆయేషా మీరా, శ్రీలక్ష్మి, సుగాలి ప్రీతి ఇలా ఆడవారిపై దాడులు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి దారుణాలు జరుగుతుంటే ప్రభుత్వాలు ఎందుకు చర్యలు తీసుకోవటంలేదని ఇది దారుణమైన విషయం అని ఆవేదన వ్యక్తంచేశారు. ఇటువంటి దారుణాలు ఆపేందుకు ప్రభుత్వాలు ఎందుకు బలంగా పనిచేయడం లేదు? అని ప్రశ్నించారు 30 వేల మంది మహిళలు అదృశ్యమైనా ప్రభుత్వం పట్టించుకోలేదని ఈ విషయంపై మాట్లాడితే తనకు నోటీసులు ఇచ్చారని మండిపడ్డారు. నోటీసులు ఇచ్చినా..కేసులు పెట్టినా భయపడేది లేదని పవన్ మరోసారి స్పష్టంచేశారు.
రాష్ట్రంలో మహిళలు అదృశ్యం కావడం చాలా పెద్ద విషయం అనీ అయినా ప్రభుత్వం మాత్రం ఏమాత్రం పట్టించుకోకుండా ప్రశ్నించినవారిపై తిరిగి కేసులు పెడుతోంది అంటూ మండిపడ్డారు. రాష్ట్రంలో ఆడవారిపై జరుగుతున్న అత్యాచారం, హత్యలపై మహిళా కమిషన్ ఏమీ మాట్లాడటంలేదని అన్నారు. జనసేన తరఫున ప్రజాకోర్టు కార్యక్రమం చేపట్టి సామాజిక మాధ్యమాల్లో లేదా ప్రత్యక్షంగా కార్యక్రమాలను చేపడతామని తెలిపారు.