Pawan Kalyan: జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తన ఎన్నికల ప్రచార రథం ‘వారాహి’ని సిద్ధం చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే తెలంగాణలో రిజిస్ట్రేషన్ పూర్తైన ఈ వాహనానికి త్వరలో సంప్రదాయ పూజ చేసేందుకు పవన్ సిద్ధమవుతున్నారు.
తెలంగాణ, ఉమ్మడి కరీంనగర్ జిల్లా కొండగట్టులో ఆయన వారాహికి పూజ చేయించబోతున్నారు. ఈ నెల 24న పవన్ కొండగట్టు వెళ్తారు. అక్కడ పూజ పూర్తైన తర్వాత సమీపంలోని ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని కూడా పవన్ దర్శించుకోబోతున్నారు. ఇక్కడ పూజా కార్యక్రమాలు పూర్తైన తర్వాత తెలంగాణలో పార్టీ ముఖ్య నేతలతో పవన్ చర్చిస్తారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ భవిష్యత్తులో తెలంగాణలో అనుసరించబోయే వ్యూహాలు, చేపట్టబోయే కార్యక్రమాల గురించి చర్చించి దిశా నిర్దేశం చేస్తారు.
ఇదే రోజున ‘అనుష్టుప్ నారసింహ యాత్ర (32 నారసింహ క్షేత్రాల సందర్శనం)’ ప్రారంభించాలని కూడా పవన్ నిర్ణయించారు. ముందుగా ధర్మపురిలో లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్న అనంతరం క్రమంగా మిగిలిన 31 నారసింహ క్షేత్రాలను పవన్ దర్శించుకుంటారు. గతంలో 2009 ఎన్నికల ప్రచారం సందర్భంగా విద్యుత్ తీగలు తగిలి ప్రమాదానికి గురైనప్పుడు కొండగట్టు ఆంజనేయస్వామి కటాక్షంతోనే ప్రమాదం నుంచి బయటపడినట్లు పవన్ కల్యాణ్ గుర్తు చేశారు.
వాహనానికి సంప్రదాయ పూజ పూర్తైన తర్వాత పవన్ ఏపీలో తన ప్రచారాన్ని మొదలుపెడతారు. నిజానికి ఈ పూజ ఈ నెల 2నే నిర్వహించాల్సి ఉన్నప్పటికీ, వివిధ కారణాల వల్ల వాయిదా పడింది.