Hayathnagar Student Suicide : హైదరాబాద్ శివారు హయత్ నగర్ లో విషాదం చోటు చేసుకుంది. హోంవర్క్ చేయలేదని టీచర్ మోకాళ్లపై నిలబెట్టడంతో అవమానంగా భావించిన 8వ తరగతి విద్యార్థిని ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. బాలిక మృతితో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈ ఘటనపై కుటుంబసభ్యులు స్కూల్ యాజమాన్యంపై మండిపడుతున్నారు. స్కూల్ సిబ్బంది నిర్వాకం వల్లే తమ బిడ్డ చనిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్కూల్ ముందు బైఠాయించి ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు భారీగా మోహరించారు. తమకు న్యాయం జరిగేలా చూడాలని బాధిత కుటుంబం డిమాండ్ చేసింది.
టీచర్ అందరి ముందూ మందలించడాన్ని అవమానంగా భావించిన బాలిక మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుందని కుటుంబసభ్యులు చెబుతున్నారు. హయత్నగర్లోని స్కూల్లో అక్షయ అనే బాలిక ఎనిమిదో తరగతి చదువుతోంది. హోంవర్క్ చేయలేదనే కారణంతో గురువారం అక్షయను టీచర్ మందలించింది. క్లాస్ బయట మోకాళ్లపై నిలబెట్టింది.
దీన్ని అక్షయ అవమానంగా భావించింది. మనస్తాపానికి గురైంది. ఇంటికి వెళ్లాక ఎవరూ లేని సమయంలో ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆమెను గమనించిన తల్లిదండ్రులు ఆస్పత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు డాక్టర్లు నిర్ధారించారు. దీంతో బాలిక తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల నేతలు స్కూల్ ఎదుట ఆందోళన చేపట్టారు. అందరి ముందూ టీచర్ అవమానించడం వల్లే అక్షయ ఆత్మహత్య చేసుకుందన్నారు. సీసీటీవీ పుటేజీ పరిశీలిస్తే నిజాలు బయటపడతాయన్నారు. సమాచారం అందడంతో రంగంలోకి దిగిన పోలీసులు స్కూల్కి చేరుకుని ఆరా తీశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఈ రోజుల్లో పిల్లల్లో విపరీత ప్రవర్తన ఆందోళనకు గురి చేస్తోంది. తల్లిదండ్రులు తిట్టారనో, టీచర్ మందలించిందనో మనస్తాపం చెందుతున్నారు. లవమానంగా ఫీల్ అవుతున్నారు. ఈ క్రమంలో తీవ్ర నిర్ణయాలు తీసుకుంటున్నారు. బలవంతంగా ప్రాణాలు తీసుకుంటున్నారు. ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. చిన్న చిన్న కారణాలకే పిల్లలు ఆత్మహత్యలు చేసుకునే వరకు వెళ్లడం ఆందోళనకు గురి చేసే అంశం.
Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw