Mumbai : మ్యాట్రిమోనియల్ వెబ్ సైట్స్ లో నకిలీ ప్రోఫైల్స్ సృష్టించి 12 మంది మహిళలను మోసం చేసిన బీటెక్ చదివిన వ్యక్తిని ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు.
థానే లోని డోంబివిలీకి చెందిన విశాల్ సురేష్ చవాన్ అలియాస్ అనురాగ్ చవాన్(33) బీటెక్ చదివాడు. తాను విదేశాల్లో మల్టీనేషనల్ కంపెనీలో సీనియర్ ఎగ్జిక్యూటివ్ గా పని చేస్తున్నానని చెపుతూ మ్యాట్రిమోనియల్ వెబ్ సైట్లలో ప్రొఫైల్ క్రియేట్ చేశాడు. చవాన్ ప్రొఫైల్ చూసిన బాధిత మహిళ (28) అతనితో మాట్లాడింది. వారిద్దరికీ అభిప్రాయాలు కలిశాయి.
అనంతరం తాను ఇండియాకు వస్తున్నానని… వచ్చాక పెళ్ళికి ముహూర్తాలు పెట్టుకుందామని అన్నాడు. అతని మాటలు నమ్మిన మహిళ అందుకు సరే అంది. ఈ క్రమంలో తన డెబిట్ కార్డ్ బ్లాక్ చేశారని ఇండియా రావటానికి తనకు డబ్బు కావాలని కోరాడు. వెంటనే ఆ మహిళ అతని ఖాతాకు రూ.2.5 లక్షల రూపాయలు బదిలీ చేసింది.
ఆ తర్వాత నుంచి చవాన్ ఆమెను దూరం పెట్టసాగాడు. ఆమెతో మాట్లాడటం తగ్గించాడు. అది గమనించిన మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలింపు చేపట్టారు. నిందితుడిపై అప్పటికే ముంబైలోని వెర్సోవా,సియోన్, నర్పోలి పోలీస్ స్టేషన్లలో పలు కేసులు నమోదయ్యాయని తెలుసుకుని అతని ఇంటిని చుట్టుముట్టారు.
Also Read : Burglars Arrest : ఇండియాలో దొంగలను, న్యూజెర్సీ నుంచి పోలీసులకు పట్టిచ్చిన ఇంటి యజమాని
తీరా పోలీసులు వెళ్లే సరికి అతని అపార్ట్ మెంట్కు తాళం వేసి ఉంది. అనుమానం వచ్చి కిటికీ లోంచి లోపలకు చూడగా నిందితుడు ఇంట్లోనే ఉన్నాడు. పోలీసులు తాళాలు పగలగొట్టి నిందితుడిని అరెస్ట్ చేశారు. చవాన్ పై చీటింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కింద కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేయగా ఇంతవరకు నిందితుడు 12 మంది మహిళలను మోసం చేసినట్లు తేలిందని ముంబై క్రైమ్ బ్రాంచ్ డీసీపీ సంగ్రామ్ సింగ్ తెలిపారు. ఇంకా ఇతని బాధితులు ఎవరైనా ఉంటే ఫిర్యాదు చేయాలని ఆయన సూచించారు.