Chikoti Praveen Casino : ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తున్న చీకోటి ప్రవీణ్ క్యాసినో వ్యవహారంలో ఈడీ విచారణ కొనసాగుతోంది. హైదరాబాద్ బషీర్ బాగ్ లోని ఈడీ కార్యాలయంలో చీకోటి ప్రవీణ్ బృందాన్ని ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఈరోజు ఉదయం ప్రారంభమైన విచారణ సాయంత్రం వరకు కొనసాగే అవకాశం ఉంది. ఈడీ అధికారుల అడిగిన బ్యాంక్ స్టేట్ మెంట్లు ప్రవీణ్, మాధవ రెడ్డి వారికి అందించారు.
గత ముూడేళ్లుగా జరిగిన బ్యాంకు లావాదేవీలపై ఈడీ అధికారులు ఆరా తీస్తున్నారు. మూడు గంటలకుపైగా ప్రవీణ్, మాధవ రెడ్డిలను ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. హవాలా ద్వారా డబ్బులు తరలింపుపై వారిని ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. నాలుగు దేశాల్లో 7 సార్లు జరిగిన క్యాసినో క్యాంపులపై ఆరాతీస్తున్నారు. బిగ్ డాడీ పేరుతో నిర్వహించిన క్యాసినో క్యాంప్ కు ఎవరెవరు హాజరయ్యారనే దానిపై ఈడీ అధికారులు విచారిస్తున్నారు.
ఫ్లయిట్ టికెట్ బుకింగ్స్, హెలికాప్టర్ రెంట్, స్టార్ హోటల్ ఖర్చులపై ఈడీ ఆరా తీస్తోంది. ప్రవీణ్, మాధవరెడ్డిలకు హైదరాబాద్ లో ఉన్న హవాలా వ్యాపారులతో సంబంధాలు, వారితో జరిపిన లావాదేవీలు పై ప్రశ్నిస్తున్నారు. ప్రవీణ్, మాధవ రెడ్డి జరిపిన హవాలా లావాదేవీలను ముందు పెట్టి ఈడీ ఇద్దరినీ పశ్నిస్తోంది. నేపాల్, శ్రీలంక, ఇండోనేసియా, థాయ్లాండ్.. తదితర దేశాల్లో క్యాసినో క్యాంపులకు వందల మంది పంటర్లను ప్రవీణ్ బృందం తరలించినట్లు ఈడీ ఇప్పటికే ప్రాథమిక ఆధారాలు సేకరించింది.
ఒక్కో విడత మూడు నాలుగు రోజులపాటు జరిగే క్యాంపుల్లో పాల్గొనేందుకు పంటర్లు రూ.3-5లక్షల చొప్పున వారికి చెల్లించినట్లు గుర్తించింది. క్యాంపుల్లో జూదం ఆడేందుకు పంటర్లకు కావాల్సిన క్యాసినో టోకెన్లను సమకూర్చడం దగ్గరి నుంచి పంటర్లు గెలుచుకున్న సొమ్మును నగదు రూపంలో అప్పగించడం వరకు అంతా హవాలా మార్గంలోనే నడిచిందనేది ఈ కేసులో ఈడీ ప్రధాన అభియోగం. మరో వైపు ప్రవీణ్ క్యాసినో వ్యవహారంలో కొంత మంది ప్రముఖులు కూడా ఉన్నారనే ఆలోచనతో ఈడీ ఆఫీసు వద్ద పెద్ద ఎత్తున పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
Also Read : Black Tiger : ఒడిషా అడవుల్లో అరుదైన నల్లపులి