IT Raids on Chitra Ramakrishna : గుర్తు తెలియని ఓ బాబాతో రహస్య సమాచారాన్ని పంచుకోవడంతో పాటు ఆయన గైడెన్స్లో పనిచేసిన నేషనల్ స్టాక్ ఎక్సైంజ్ మాజీ సీఈవో, ఎండీ చిత్రా రామకృష్ణ ఇళ్లపై ఆదాయపు పన్ను శాఖ దాడులు నిర్వహిస్తోంది. NSEకి సీఈవోగా ఉంటూ ఆమె వ్యక్తిగత జీవితంతో పాటు.. వృత్తిగత జీవితంలో ఏ పని చేయాలన్నా హిమాలయాల్లో ఉంటున్న ఓ యోగి ఆమోద ముద్ర పడితే కానీ చిత్రా ముందడుగు వేయలేదు. NSEలో ఎవరిని నియమించాలి?.. ఎవరికి ప్రమోషన్ ఇవ్వాలి?.. ఎవరికెంత జీతం పెంచాలన్న విషయాలతో పాటు.. NSE డివిడెంట్, ఆర్థిక ఫలితాల వివరాలు, బోర్డ్ మీటింగ్ ఎజెండా.. ఫైనాన్షియల్ డేటా మొత్తం ఆ గుర్తు తెలియని యోగి డైరెక్షన్లోనే జరిగాయి.
యోగిని చిత్రా ఎప్పుడు కలవలేదు.. నేరుగా మాట్లాడలేదు. మెయిల్ రూపంలోనే వారి మధ్య సంభాషణలు కొనసాగాయి. చిత్రా ప్రశ్నలు అడగడం.. దానికి యోగి సమాధానాలు చెప్పడం. యోగి చెప్పిన వారికే ప్రమోషన్లు.. యోగి చెప్పిన ప్రాజెక్టులపైనే సంతకాలు. ఇలా సాగిపోయింది NSEలో చిత్రా రామకృష్ణ శకం. దాదాపుగా 20 ఏళ్లుగా చిత్రాకు ఆ యోగి గైడ్గా పనిచేశారు. 2013 ఏప్రిల్ నుంచి 2016 డిసెంబర్ వరకు ఎన్ఎస్ఈ ఎండీ, సీఈవోగా చిత్రా రామకృష్ణ పనిచేశారు. ఆ తర్వాత కూడా పనిచేసేవారే కావచ్చు.
కానీ ఉన్నపళంగా రాజీనామా చేయాలంటూ సెబీ నుంచి ఆదేశాలు రావడంతో చిత్రాకు రిజిగ్నేషన్ తప్ప వేరే దారి కనిపించలేదు. దీనంతటికి కారణం ఆనంద్ సుబ్రమణియన్ అనే వ్యక్తి. క్యాపిటల్ మార్కెట్పై ఎలాంటి అనుభవం లేని ఆనంద్ను NSE చీఫ్ స్ట్రాటజిక్ అడ్వైజర్గా నియమించారు . ఈ పోస్ట్ కోసం వచ్చిన ఏకైన వ్యక్తి ఆనంద్. అంతకు ముందు ఓ చిన్న కంపెనీలో ఏడాదికి 15 లక్షల జీతంతో మేనేజర్ స్థాయిలో పనిచేస్తున్న ఆనంద్ను ఏకంగా కోటి 68 లక్షల వార్షిక వేతనం ఇచ్చి అడ్వైజర్గా కూర్చొబెట్టారు చిత్ర.
అక్కడితో ఆగలేదు. ఆ జీతాన్ని 2014లో రెండు కోట్లు, 2015లో 3 కోట్ల 33 లక్షలకు పెంచారు. అంతేకాదు ఎండీకి సలహాదారుగా ప్రమోషన్ కట్టబెట్టారు. 2016లో ఆనంద్ జీతాన్ని 4 కోట్ల 21 లక్షలకు పెంచారు. ఇదంతా కూడా యోగి శిరోన్మణి డైరెక్షన్లోనే సాగిందని సెబీ దర్యాప్తులో తెలింది. ఇదంతా ఒక ఎత్తైతే ఆనంద్ వారానికి ఐదు రోజులకు బదులు మూడు రోజులు పనిచేస్తే చాలని యోగి ఆదేశాలు ఇవ్వడంతో.. దాన్నికూడా తూచా తప్పకుండా అమలు చేశారు చిత్ర.
IT Raids : మధ్యప్రదేశ్లో ఐటీ దాడులు.. అండర్ గ్రౌండ్ వాటర్ ట్యాంకులో దాచిన రూ.8కోట్లు, నగలు సీజ్
2016లో సుబ్రమణియన్.. అపాయింట్మెంట్లో అవకతవకలు జరిగాయని తెలియడంతో NSE నుంచి చిత్రా రామకృష్ణను తొలగించారు. అప్పుడు ఆమెకు రావాల్సిన అన్ని పెండింగ్ ప్రయోజనాల విలువ 44కోట్ల రూపాయలను ఆమెకు మూటకట్టారు. ఆ తర్వాత చిత్ర తీరుపై తవ్వకాలు ప్రారంభించిన సెబీ సంచలన విషయాలను తెలుసుకుంది. ఆనంద్ పనితీరుపై ఎలాంటి అంచనాలు, రిపోర్ట్లు లేకుండానే కేవలం యోగి చెప్పారని మాత్రమే అతని జీతాన్ని పెంచుకుంటూ పోయారని తేలింది.
సుబ్రమణియన్కు ఎండీ, సీఈవో స్థాయి అధికారాలు ఉన్నాయని.. విమానాల్లో కూడా ఫస్ట్ క్లాస్లో ప్రయాణించేందుకు వెసులు బాటు ఇచ్చారని సెబీ తెలుసుకుంది. మొత్తం వ్యవహారంపై ఆగ్రహం వ్యక్తం చేసిన సెబీ చిత్రా రామకృష్ణను క్యాపిటల్ మార్కెట్ నుంచి మూడేళ్ల పాటు నిషేధించింది. అంతేగాకుండా.. అడిషనల్ లీవ్ ఎన్క్యాష్మెంట్ కింద కోటీ 54 లక్షలు.. బోనస్ కింద ఇచ్చిన 2 కోట్ల 83 లక్షల రూపాయలను జప్తు చేయాలని NSEని ఆదేశించింది సెబీ.