Visakhapatnam Constable : గత నెల 30న అదృశ్యమైన విశాఖపట్నానికి చెందిన క్రైమ్ కానిస్టేబుల్ శ్రీనివాస నాయుడు విగత జీవిగా మిగిలాడు. డిసెంబర్ 30న విజయనగరం జిల్లా గరుగుబిల్లి మండలం లోని నందివాని వలస నుంచి విశాఖపట్నం వస్తుండగా డోకుల శ్రీనివాస నాయుడు కనిపించకుండా పోయాడు.
స్ధానిక పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం….డోకుల శ్రీనివాసనాయుడు(38) 2009 బ్యాచ్ కు చెందిన వ్యక్తి. విశాఖపట్నంలోని ఎంవీపీ క్రైమ్ పోలీసు స్టేషన్ లో కానిస్టేబుల్ గా పని చేస్తున్నాడు. గత నెల 30న వ్యక్తిగత పనుల నిమిత్తం స్వగ్రామం విజయనగరం జిల్లా గరుగుబిల్లి మండలంలోని నందివాని వలసకు వచ్చాడు.
అక్కడి నుంచి కురుపాంసమీపంలోని జోగిరాజు పేటకు వెళ్లాడు. తిరుగు ప్రయాణంలో పెదమేరంగి జంక్షన్ నుంచి నందివాని వలసలోని తన ఇంటికి వెళ్లకుండా అత్యవసర పని ఉందని చల్లికి చెప్పి రాత్రి 9-15కి మోటారు సైకిల్ పై వెళ్లిపోయాడు. తరవాత ఖడ్గవలస, ఉల్లిభద్ర జంక్షన్ వరకు వెళ్లినట్లు సెల్ ఫోన్ సిగ్నల్స్ లభించాయి. తరువాత శ్రీనివాస నాయుడుఆచూకీ లభ్యంకాలేదు.
డిసెంబర్ 31న తండ్రి సింహచలం నాయుడు గరుగుబిల్లి పోలీసు స్టేషన్ లో మిస్సింగ్ కేసు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మూడ ప్రత్యేక టీంలు ఏర్పాటు చేసుకుని గాలింపు చేపట్టారు. చివరకు శనివారం మధ్యాహ్నం తోటపల్లి ఐటీడీఏ పార్క్ సమీపంలోని తుప్పల్లో శ్రీనివాస నాయుడు మోటారు సైకిల్ కనుగొన్నారు.
అక్కడకు సమీపంలోనే తుప్పల్లో శ్రీనివాస నాయుడు మృతదేహం లభ్యం అయ్యింది. మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం పార్వతీపురం ఏరియా ఆస్పత్రికి తరలించారు.
Akso Read : Telangana Rains : రేపు, ఎల్లుండి తెలంగాణాలో ఓ మోస్తరు వర్షాలు
విశాఖపట్నంలోని ఎంవీపీ క్రైమ్ పోలీసు స్టేషన్ లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్న శ్రీనివాస నాయుడు విశాఖ, నందివానివలసలో వ్యాపారాలు చేస్తున్నాడు. మృతుడికి భార్య ఇద్దరూ పిల్లలు ఉన్నారు. శ్రీనివాస నాయుడు మోటారు సైకిల్ పై వస్తుండగా యాక్సిడెంట్ జరిగి మరణించాడా…లేక వ్యాపారాల్లో ఆర్ధిక లావాదేవీల్లో ఏదైనా జరిగిందా… అన్నకోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.