Police And RPF Rescued Children : మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో రైలులో అక్రమంగా తరలిస్తున్న 59మంది పిల్లలను ఆర్పీఎఫ్ సిబ్బంది, పోలీసులు కాపాడారు. మానవ అక్రమ రవాణాకు సంబంధించి ఐదుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బీహార్ కు చెందిన 59మంది చిన్నారులను దానాపూర్-పూణే ప్రత్యేక ఎక్స్ ప్రెస్ రైలులో అక్రమంగా తరలిస్తున్నట్లు సమాచారం అందింది.
దీంతో ఓ ఎన్జీవో సంస్థ సిబ్బంది, స్థానిక పోలీసులు, ఆర్పీఎఫ్ సిబ్బంది కలిసి రంగంలోకి దిగారు. బుధవారం ఉదయం ఆ రైలు భుసావల్ స్టేషన్ కు చేరిన వెంటనే అన్ని కంపార్ట్ మెంట్లను తనిఖీ చేశారు. మొదటగా ఆ స్టేషన్ లో 29 మంది పిల్లలను కాపాడారు. ఆ తర్వాత మన్మాడ్ స్టేషన్ కు ఆ రైలు చేరగా మరో 30మంది పిల్లలను రక్షించారు.
One-year-old girl rescued: ముంబై నుంచి తెలంగాణకు ఏడాది పాపను తరలించాలనుకున్న ముఠా.. అరెస్టు
8 నుంచి 15ఏళ్ల మధ్య వయసు ఉన్న 59మంది పిల్లలను బీహార్ నుంచి మహారాష్ట్రలోని సాంగ్లీకి తరలిస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. మానవ అక్రమ రవాణా నేరం కింద ఐదుగురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు తెలిపారు. ఎన్జీవో సిబ్బంది, పోలీసుల సహకారంతో పిల్లల అక్రమ రవాణాను అరికట్టినట్లు ఆర్పీఎఫ్ వెల్లడిస్తూ ట్వీట్ చేసింది.