Omicron : అమెరికాలో కోవిడ్ కొత్త వేరియంట్ “ఒమిక్రాన్” కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. తాజాగా న్యూయార్క్ రాష్ట్రంలో కొత్తగా ఐదు ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయని ఆ రాష్ట్ర గవర్నర్ కాథీ హోచుల్ శుక్రవారం ప్రకటించారు. ఈ మేరకు ఆమె ఓ ట్వీట్ చేశారు.
ఈ వేరియంట్ ఖచ్చితంగా దేశంలోకి చేరుకుంటుందన్న విషయం తమకు తెలుసునని,దీని వ్యాప్తిని అడ్డుకునే సాధనాలు తమ దగ్గర ఉన్నాయని ఆ ట్వీట్ లో కాథీ హోచుల్ తెలిపారు. అందరూ వ్యాక్సిన్ తీసుకోవాలని,మాస్క్ లు ధరించాలని,బూస్టర్ డోస్ వ్యాక్సిన్ కూడా తీసుకోవాలని ఆమె సూచించారు. ఇక,తాజా కేసులతో కలిపి అమెరికాలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య ఎనిమిదికి చేరింది. అయితే ఈ ఎనిమిది మందిలో ఒకరికి ఎలాంటి ట్రావెల్ హిస్టరీ లేదు.
అమెరికాలో తొలికేసు నవంబర్ 25న కాలిఫోర్నియాలో నమోదయింది. ఇప్పుడు అది మిన్నెసొటా, న్యూయార్క్, కొలరాడోకు విస్తరించింది.
మరోవైపు,ఒమిక్రాన్ను కట్టడి చేసేందుకు సిద్ధంగా ఉన్నామని రెండు రోజుల క్రితం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు. ఈ వేరియంట్ను చూసి భయం, కంగారు పడొద్దని ప్రజలకు సూచించారు. లాక్డౌన్లతో కాకుండా మరింత విస్తృతమైన వ్యాక్సినేషన్, బూస్టర్ డోసుల పంపిణీ, నిర్ధరణ పరీక్షల పెంపు వంటి అస్త్రాలతో కొవిడ్ను సమర్థంగా ఎదుర్కొందాం అని బైడెన్ అన్నారు.
కాగా, డెల్టా రకం కంటే ఆరు రెట్లు వేగంతో వ్యాప్తి చెందే లక్షణం కలిగిన ఈ ఆందోళనకర వేరియంట్ రోజుల వ్యవధిలోనే 29 దేశాలకు పాకింది. భారత్ లో కూడా రెండు ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి.
ALSO READ Omicron : డెల్టాతో పోలిస్తే..రీ ఇన్ఫెక్షన్స్ మూడు రెట్లు ఎక్కువ!