Russia deadly attack : యుక్రెయిన్పై రష్యా దండయాత్ర కొనసాగుతోంది. రెండు నగరాల్లో సీజ్ ఫైర్ ప్రకటించిన రష్యా… మిగిలిన నగరాలపై మాత్రం బాంబుల వర్షం కురిపిస్తోంది. మరియుపోల్, వోల్నావోఖ్లో సామాన్యపౌరుల తరలింపునకు అనుకూలంగా కాల్పుల విరమణ పాటించగా… ఖార్కివ్, సుమి, చెర్నివ్ నగరాలపై మాత్రం బాంబుల మోత కురిపిస్తోంది.
చెర్నివ్లో జనావాసలపై రష్యా మిస్సైల్స్ విరుచుకుపడ్డాయి. భారీ శబ్దాలతో బంకర్లలో తలదాచుకున్నవారు కూడా ఉలిక్కిపడ్డారు. ఈ దాడుల్లో దాదాపు 33మంది చనిపోయినట్లు చెబుతున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. మిస్సైళ్ల దాడిలో నాలుగు అపార్ట్మెంట్లు ధ్వంసం అయ్యాయి.
మరోవైపు చెర్నివ్ శివార్లలో యుక్రెయిన్ ఎయిర్డిఫెన్స్ సిస్టమ్ ఓ రష్యా యుద్ధవిమానాన్ని కూల్చివేసినట్లు ఆ దేశ రక్షణశాఖ మంత్రి ప్రకటించారు. మరోవైపు మరియుపోల్, వోల్నావోఖ్లోనూ రష్యా పూర్తిస్థాయిలో కాల్పుల విరమణను పాటించడం లేదని యుక్రెయిన్ ఆరోపిస్తోంది. ఇటు కాల్పుల విరమణతో ఓవైపు ప్రజలు వోల్నావోఖ్ను ఖాళీ చేస్తుండగా మరోవైపు సహాయక బృందాలు గాయపడ్డ వారిని ఆసుపత్రులకు తరలిస్తున్నాయి.
కాల్పుల కారణంగా రెండ్రోజులుగా సహాయక బృందాలు గాయపడ్డవారిని కూడా కాపాడలేకపోయాయి. ఇప్పుడు అవకాశం దొరకడంతో వారిని రక్షిస్తున్నారు. ఇదిలావుండగా కీవ్ సమీపంలోని గ్రామంపై రష్యా వైమానిక దాడికి పాల్పడింది. ఈ ఘటనలో చిన్నారి సహా ఆరుగురు మృతి చెందారు.
మరోవైపు రష్యా దాడుల్లో వోల్నావోఖ్ దాదాపు 90శాతం ధ్వంసమైందని స్థానిక ఎంపీ ఆవేదన వ్యక్తం చేశారు. వీధుల్లో మృతదేహాలు చెల్లాచెదురుగా పడిపోయి ఉన్నాయని ఎంతమంది చనిపోయారన్నదానిపై స్పష్టత కూడా లేదని అంటున్నారు. బంకర్లలో తలదాచుకుంటున్నవారికి ఆహారం కూడా అందడం లేదన్నారు.