Taliban vs Panjshir: అఫ్ఘానిస్తాన్ దేశంలో తాలిబాన్లకు ఎదురొడ్డి పోరాడుతోన్న ప్రాంతం పంజ్షీర్.. స్వేచ్ఛ కోసం పంజ్ షేర్, దురాక్రమణకు తాలిబాన్లు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. పంజ్షీర్ ప్రావిన్సును తాలిబన్లు అష్టదిగ్బంధనం చేసుకునే ప్రయత్నం చేస్తుండగా.. పంజ్షీర్ సేనలు ఎదురుదాడి చేస్తున్నాయి. ఈక్రమంలోనే పొరుగున ఉన్న బఘ్లాన్ ప్రావిన్సులో ఎవ్వరూ ఊహించని విధంగా తాలిబన్లపై మెరుపుదాడులు చేయగా 300 మంది తాలిబన్లు హతమయ్యారు.
తలవంచని పౌరులుగా పేరున్న పంజ్షీర్ ప్రాంత ప్రజలు అండరాబ్ జిల్లాలో మోహరించిన తాలిబన్లపై దాడులు జరిపారు. తాలిబన్లపై సేనల దాడులు చేసే సమయంలో సామాన్యులు సైతం సైన్యంగా మారినట్లుగా చెబుతున్నారు. పంజ్షీర్ ప్రావిన్సును తాలిబన్లు చుట్టుముట్టినా వారు ఏ మాత్రం తగ్గట్లేదు.. తాలిబాన్లను తమ ఫ్రావిన్సులో పెత్తనం చేయనివ్వమని తెగేసి చెబుతున్నారు.
తాలిబాన్లు ప్రత్యేకంగా శ్రద్ధ చూపిస్తున్న ప్రాంతం పంజ్షీర్ లోయ.. ఈ లోయ కాబూల్కు ఉత్తరాన ఉండగా.. చుట్టూ హిందూకుష్ కొండలు ఉండగా.. తాలిబాన్ వ్యతిరేక శక్తికి కేంద్రంగా ఈ ప్రాంతం ఉంది. అఫ్ఘానిస్తాన్ భౌగోళిక, వ్యూహాత్మక పరిస్థితిపై మంచి అవగాహన ఉన్న నిపుణులు, తాలిబాన్లు తమ చివరి కాలంలో పంజ్షీర్ లోయను స్వాధీనం చేసుకోలేకపోయారు. ఈ లోయ అహ్మద్ వలీ మసూద్ బలమైన కోటగా భావిస్తారు. అతను అహ్మద్ షా మసూద్ కుమారుడు. అహ్మద్ షా మసూద్ 2001లో మరణించారు. అతని మరణానికి ముందు, అహ్మద్ షా మసూద్ పంజ్షీర్ లోయలో ఆధిపత్యం చలాయించేవాడు.
పంజ్షీర్ అంటే ఐదు సింహాల లోయ అని అర్థం. అఫ్ఘానిస్తాన్లో తాలిబాన్ ఉగ్రవాదులు ప్రవేశించడానికి ధైర్యం చేయని ఏకైక ప్రదేశం ఇది. ఆఫ్ఘనిస్తాన్లో 32 ప్రావిన్సులు తాలిబాన్ నియంత్రణలోకి వచ్చాయి. రాజధాని కాబూల్ కూడా ఉగ్రవాదుల ఆధీనంలోకి వచ్చింది. అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ ప్రభుత్వం పడిపోయింది. అధ్యక్షుడు ఘనీ దేశం విడిచి పారిపోయారు. కానీ ఈ ప్రాంతం మాత్రం తాలిబాన్లకు లొంగట్లేదు.