Tamil Nadu student : రష్యా దండయాత్ర వేళ…యుక్రెయిన్లో చిక్కుకుపోయి స్వదేశం వచ్చేందుకు అలమటిస్తున్న భారతీయులే కాదు….యుక్రెయిన్ కోసం పోరాడే భారతీయులూ ఉన్నారు. రష్యా భీకర దాడులతో బెంబేలెత్తిస్తున్న వేళ….ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని భారతీయులు..ఉరుకులు పరుగులు పెడుతోంటే…తమిళనాడుకు చెందిన ఓ విద్యార్థి మాత్రం..యుక్రెయిన్ ఆర్మీతో కలిసి యుద్దరంగంలో తలపడుతున్నాడు. సాయినికేష్ రవిచంద్రన్ అనే 21 ఏళ్ల కోయంబత్తూర్ యువకుడు…యుక్రెయిన్ పారామిలటరీ బలగాల్లో భాగంగా మారాడు.
రణరంగంలో రష్యా సైనికులతో తలపడుతున్నాడు. యుక్రెయిన్లోని అతని ఇంటిని అధికారులు పరిశీలించగా ఈ విషయం వెలుగుచూసింది. సాయినికేష్ ఖార్కైవ్లోని నేనల్ ఏరోస్పేస్ యూనివర్శిటీలో చదువుకునేందుకు 2018లో యుక్రెయిన్ వెళ్లాడు. ఈ ఏడాది జులైనాటికి సాయినికేష్ చదువు పూర్తికానుంది. అయితే రష్యా యుక్రెయిన్ యుద్ధం మొదలైన తర్వాత సాయినికేష్ ఆచూకీ…స్వదేశంలోని అతని కుటుంబానికి దొరకలేదు.
దీంతో వారు రాయబార కార్యాలయాన్ని సంప్రదించగా…వారు..సాయినికేష్ను గుర్తించగలిగారు. రష్యాకు వ్యతిరేకంగా పోరాడడానికి యుక్రేనియన్ పారామిలటరీ బలగాల్లో చేరుతున్నానని సాయినికేశ్ తన కుటుంబానికి తెలియజేశాడు. సాయినికేశ్…భారత ఆర్మీలో చేరేందుకు అప్లయ్ చేయగా…తిరస్కరించిన వివరాలు కూడా అతని నివాసంలో అధికారులకు లభ్యమయ్యాయి.