AC theft In ATM Center : ఏటీఎంలో దొంగలు పడ్డారని మిషన్ ఎత్తుకు పోయారనే వార్తలు వింటుంటాం. కానీ పంజాబ్ లో మాత్రం వింత దొంగలు చేసిన పని ఏటీఎం సెంటర్ లో ఉన్న సీసీటీవీలో రికార్డు అయ్యింది. ఏటీఎం సెంటర్ లో చోరికి వచ్చిన దొంగలు డబ్బులున్న మిషన్ జోలికిపోలేదు. కానీ సెంటర్లోని ఏసీని ఎత్తుకుపోయారు.
పంజాబ్ లోని మోగా జిల్లాలోని బాఘ్ పట్టణం ఎస్బీఐ ఏటీఎం ఉంది. ఆదివారం (జులై 16,2023)న ఈ సెంటర్ లో ఇద్దరు వ్యక్తులు బైక్ మీద వచ్చారు.ఏటీఎం సెంటర్ లోకి వెళ్లారు. ఒకరు డస్టబిన్ను తిరగేశాడు. మరొకరు దానిపైకి ఎక్కి ఏసీకి ఉండే వైర్లు కట్ చేశాడు. ఆ తరువాత ఇద్దరూ కలిసి ఏసీని కిందకు దించి తీసుకెళ్లిపోయారు. ఈ చోరీపై బ్యాంకు మేనేజర్ పోలీసులకు ఫిర్యాదు చేయటంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఏసీ దొంగల కోసం విస్తృతంగా గాలిస్తున్నారు.