RGV : వివాదాల దర్శకుడు రామ్గోపాల్ వర్మ ఇటీవల సైలెంట్ గా ఉంటూనే కేవలం తన ట్వీట్స్, సినిమాలతో మాత్రమే హడావిడి చేస్తున్నారు. కానీ గత కొద్ది రోజులుగా మళ్ళీ ఆర్జీవి వివాదాల్లో నిలుస్తున్నారు. కొన్ని రోజుల క్రితమే ఆర్జీవీ తనకి డబ్బులు ఇవ్వాలంటూ నట్టి కుమార్ ఆరోపించి తన సినిమాలని రిలీజ్ చేయకుండా ఆపుతూ కేసులు వేస్తున్నాడు. తాజాగా మరో వ్యక్తి ఆర్జీవీ తన దగ్గర సినిమా నిర్మాణానికి డబ్బులు తీసుకొని తిరిగి ఇవ్వట్లేదని కేసు వేశారు.
శేఖర్ ఆర్ట్ క్రియేషన్ యజమాని శేఖర్ రాజు తాజాగా కూకట్ పల్లి కోర్టులో ఆర్జీవీపై కేసు నమోదు చేశారు. ఇటీవల ఆర్జీవీ దిశా ఎన్కౌంటర్ అనే సినిమా తీసిన సంగతి తెలిసిందే. 2019లో హైదరాబాద్ శివారులో వెటర్నరీ డాక్టర్పై జరిగిన హత్యాచార ఘటన, నిందితుల ఎన్కౌంటర్ నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించారు. పలు వివాదాల మధ్య వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా జనవరిలో రిలీజ్ అయింది. అయితే ఈ సినిమా నిర్మాణానికి గాను వర్మ తన నుంచి రూ.56 లక్షలు తీసుకున్నట్లు శేఖర్ రాజు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేకాక తిరిగి డబ్బులు అడిగితే తనని బెదిరిస్తున్నాడని కూడా ఆరోపించాడు.
ఈ కేసుని తీసుకున్న కోర్టు విచారణ జరిపిన తర్వాత ఆర్జీవీపై కేసు నమోదు చేయాలని పోలీసు అధికారులను ఆదేశించింది. ప్రస్తుతం మియాపూర్ పోలీస్ స్టేషన్ లో ఆర్జీవిపై కేసు నమోదయింది. ఇటీవల నట్టి కుమార్ వ్యాఖ్యలపై, కేసులపై స్పందించిన ఆర్జీవీ మరి దీనిపై ఎలా స్పందిస్తాడో చూడాలి.