Suryakumar Yadav
IND vs WI : సిరీస్లో నిలబడాలి అంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో భారత బ్యాటర్లు అదగొట్టారు. సూర్యకుమార్ యాదవ్ (83; 44 బంతుల్లో 10ఫోర్లు, 4 సిక్సర్లు) విధ్వంసం సృష్టించగా తిలక్ వర్మ(49 నాటౌట్; 37 బంతుల్లో 4 ఫోర్లు, 1సిక్స్ ) సమయోచితంగా రాణించడంతో 160 పరుగుల లక్ష్యాన్ని భారత్ 17.5 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఫలితంగా 5 టీ20 మ్యాచ్ల సిరీస్లో భారత్ బోణీ కొట్టడంతో పాటు విండీస్ ఆధిక్యాన్ని 2-1కి తగ్గించింది.
లక్ష్య ఛేదనలో భారత్కు శుభారంభం దక్కలేదు. భారీ అంచనాల మధ్య టీ20ల్లో అరంగ్రేటం చేసిన ఓపెనర్ యశస్వి జైశ్వాల్ రెండు బంతుల్లో ఒక్క పరుగు మాత్రమే చేసి తొలి ఓవర్లో మెకాయ్ బౌలింగ్లో ఔట్ అయ్యాడు. మరికాసేపటికే పేలవ ఫామ్ను కొనసాగిస్తూ మరో ఓపెనర్ శుభ్మన్ గిల్(6) సైతం అల్జారీ జోసెఫ్ బౌలింగ్లో ఔట్ అయ్యాడు. దీంతో 34 పరుగులకే ఓపెనర్లు ఇద్దరు పెవిలియన్కు చేరారు.
ఈ మ్యాచ్లో కూడా భారత్కు ఓటమి తప్పదేమో అనిపించింది. అయితే.. వన్డౌన్లో వచ్చిన 360 డిగ్రీస్ ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ వచ్చి రావడంతోనే విధ్వంసం మొదలుపెట్టాడు. ఎడాపెడా బౌండరీలు బాదుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. ఈ క్రమంలో 23 బంతుల్లో అర్థశతకాన్ని పూర్తి చేసుకున్నాడు. అతడికి తెలుగు తేజం తిలక్ వర్మ చక్కని సహకారం అందించాడు.
హాఫ్ సెంచరీ తరువాత సూర్య మరింత దూకుడు పెంచాడు. ఈ క్రమంలో శతకానికి చేరువైన సమయంలో అల్జారీ జోసెఫ్ బౌలింగ్(12.4వ ఓవర్)లో భారీ షాట్కు యత్నించి ఔట్ అయ్యాడు. దీంతో 87 పరుగుల మూడో వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. అప్పటికే భారత్ విజయ తీరాలకు చేరింది. మిగిలిన పనిని హార్దిక్ పాండ్య(20 నాటౌట్; 15 బంతుల్లో 1 సిక్స్)తో కలిసి తిలక్ వర్మ పూర్తి చేశాడు.
అంతక ముందు మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. విండీస్ బ్యాటర్లలో బ్రాండన్ కింగ్ (42; 42 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్), పావెల్ (40 నాటౌట్; 19 బంతుల్లో 1 ఫోరు, 3 సిక్సర్లు) రాణించగా కైల్ మేయర్స్(25; 20 బంతుల్లో 3ఫోర్లు, 1సిక్స్), నికోలస్ పూరన్(20; 12బంతుల్లో 2ఫోర్లు, 1సిక్స్)లు ఫర్వాలేదనిపించారు. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ మూడు వికెట్లు తీయగా, ముకేశ్ కుమార్, అక్షర్ పటేల్లు చెరో వికెట్ పడగొట్టారు.
Rohit Sharma : పాకిస్తాన్ బౌలర్లపై ప్రశ్న.. రోహిత్ శర్మ సమాధానం విన్న రితికా ఏం చేసిందంటే..?
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న విండీస్కు ఓపెనర్లు కైల్ మేయర్స్, కైల్ మేయర్స్ తొలి వికెట్కు 55 పరుగులు జోడించి శుభారంభం అందించారు. ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడిని మేయర్స్ను ఔట్ చేయడం ద్వారా అక్షర్ పటేల్ విడగొట్టాడు. మరికాసేపటికే చార్లెస్(12)ను కుల్దీప్ యాదవ్ బోల్తాకొట్టించాడు. నాలుగో స్థానంలో వచ్చిన పూరన్ దూకుడుగా ఆడాడు. బ్రెండన్ కింగ్తో కలిసి ఇన్నింగ్స్ను స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు.
అయితే.. ఒకే ఓవర్లో కుల్దీప్ యాదవ్ వీరిద్దరిని ఔట్ చేయడం ద్వారా భారత్ను తిరిగి పోటీలోకి తెచ్చాడు. హెట్మ్మయర్ (9) విఫలమైనా ఆఖర్లో పావెల్ ధాటిగా ఆడడంతో విండీస్ గౌరవప్రదమైన స్కోరు చేసింది.