KTR – TSRTC: తెలంగాణ (Telangana) మంత్రివర్గ సమావేశం ముగిసింది. దాదాపు 5 గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో తీసుకున్న కీలక నిర్ణయాలపై మంత్రి కేటీఆర్ వివరాలు తెలిపారు. ప్రభుత్వంలో టీఎస్ఆర్టీసీని విలీనం చేస్తున్నట్లు కేటీఆర్ ప్రకటించారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో బిల్లును ప్రవేశపెడతామని తెలిపారు. విధివిధానాలు నిర్ణయించేందుకు కమిటీ ఏర్పాటు చేస్తామన్నారు.
దీంతో టీఎస్ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వ ఉద్యోగులుగా మారనున్నారు. 43 వేల మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తామని కేటీఆర్ చెప్పారు. వర్షాలకు పంటలు, రహదారులు బాగా దెబ్బతిన్నాయని కేటీఆర్ అన్నారు. తక్షణ సాయం కింద రూ.500 కోట్లు విడుదల చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుందని చెప్పారు. 27 వేల మంది ముంపు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించామన్నారు.
వరదల్లో మృతి చెందిన వారికి పరిహారం అందిస్తామని కేటీఆర్ తెలిపారు. విద్యుత్ వీరులకు ఆగస్టు 15న సన్మాన కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పారు. ఖమ్మంలో మున్నేరు వెంట రిటైనింగ్ వాల్, రోడ్లకు వెంటనే తాత్కాలిక మరమ్మతులకు కేబినెట్ నిర్ణయం తీసుకుందని అన్నారు.
తెలంగాణలో మరో ఎనిమిది మెడికల్ కాలేజీలు కేబినెట్ ఆమోదం తెలిపిందని కేటీఆర్ చెప్పారు. కేంద్ర ప్రభుత్వ ఉచిత సలహాలు మాని.. సహాయం చేయాలని అన్నారు.