Mark Zuckerberg: ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ సోమవారం రాత్రి దాదాపు 9గంటల 15నిమిషాల నుంచి భారతదేశంతో సహా ప్రపంచంలోని అన్ని దేశాలలో నిలిచిపోయాయి. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ సేవలు ఇవాళ(5 అక్టోబర్ 2021) ఉదయం నాలుగు గంటల సమయంలో తిరిగి ప్రారంభమయ్యాయి.
అయితే, Facebook, Instagram, WhatsAppలు మళ్లీ పునరుద్ధరించినట్లుగా కంపెనీ చెబుతోంది. అయితే, ఈ సమస్య పూర్తిగా పరిష్కరించలేదని, పూర్తిగా సమస్య పరిష్కారం అవ్వడానికి మరికొంత సమయం పట్టవచ్చని కంపెనీ చెబుతోంది. ఈమేరకు ట్విట్టర్లో ఓ పోస్ట్ చేసిన ఫేస్బుక్.. “క్షమించండి. ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది ప్రజలు, వ్యాపారాలు మాపై ఆధారపడి ఉన్నాయి. మా యాప్ల సేవలను పూర్తిగా పునరుద్ధరించడానికి మేము కృషి చేస్తున్నాము. మాకు సపోర్ట్ చేస్తున్నందుకు ధన్యవాదాలు.’ అని ట్వీట్ చేసింది.
అయితే, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్లు ఎందుకు నిలిచిపోయాయో ఇంకా తెలియలేదు. సోమవారం రాత్రి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్విట్టర్ కూడా కాసేపు నిలిచిపోయింది. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ మరియు వాట్సాప్ సైట్లు పూర్తిగా మూసివేయబడినప్పుడు, వినియోగదారులందరూ ట్విట్టర్ వాడడం ప్రారంభించారు. చాలామంది నెటిజన్లు తమ సమస్యలను ట్విట్టర్లో షేర్ చేసుకున్నారు. మార్క్ జూకర్బర్గ్ మీద ఫన్నీ మీమ్లు వేశారు.
ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ మూడు దిగ్గజ ఫ్లాట్ ఫామ్లు ఆరు గంటల సేపు ఆగిపోగా.. ఫేస్బుక్ యజమాని మార్క్ జూకర్ బర్గ్ వ్యక్తిగత సంపద 6 బిలియన్ డాలర్లకు పైగా పడిపోయింది. ఫేస్బుక్ స్టాక్ ఒక రోజు మొత్తం 4.9శాతం తగ్గిపోయింది. ప్రపంచంలోని అత్యంత ధనవంతుల జాబితాలో కూడా ఒక స్థానం కిందకు పడిపోయాడు.
సోమవారం స్టాక్ స్లయిడ్లో జుకర్బర్గ్ విలువ 121.6 బిలియన్ డాలర్లకు పడిపోగా.. బిల్ గేట్స్ కంటే దిగువకు దిగిపోయి బిలియనీర్స్ ఇండెక్స్లో 5వ స్థానానికి చేరుకున్నారు జూకర్ బర్గ్.