AIADMK: ఏఐఏడీఎంకే నుంచి తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వాన్ని తొలగించారు. పార్టీ పగ్గాలు మాజీ ముఖ్యమంత్రి పళనిస్వామి చేతుల్లోకి వెళ్ళాయి. పార్టీ కార్యవర్గ సమావేశంలో ఈ మేరకు పళనిస్వామి వర్గం నిర్ణయాలు తీసుకుంది. పార్టీ తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా ఆయనను ఎన్నుకున్నారు. పన్నీర్ సెల్వం ప్రాథమిక సభ్యత్వాన్ని రద్దు చేస్తున్నట్లు కార్యవర్గ సమావేశం ఓ ప్రకటనలో తెలిపింది. ఈ నేపథ్యంలో పన్నీర్ సెల్వం మీడియాతో మాట్లాడుతూ.. తనను పార్టీ నుంచి ఎవ్వరూ తొలగించలేరని చెప్పారు.
తనను 1.5 కోట్ల మంది పార్టీ శ్రేణులు సమన్వయకర్తగా ఎన్నుకున్నారని చెప్పుకొచ్చారు. పళనిస్వామి సహా పార్టీలోని ఏ నాయకుడికీ తనను ఏఐఏడీఎంకే నుంచి తొలగించే హక్కు లేదని ఆయన అన్నారు. తనను పార్టీ నుంచి బహిష్కరిస్తూ తీసుకున్న నిర్ణయం చెల్లదని చెప్పారు. ఈ విషయంపై తాను న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానని తెలిపారు. కాగా, పన్నీర్ సెల్వాన్ని పార్టీ నుంచి తొలగించిన నేపథ్యంలో చెన్నైలోని పలు ప్రాంతాల్లో పోలీసులు 144 సెక్షన్ విధించారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలూ చోటుచేసుకోకుండా చర్యలు తీసుకుంటున్నారు.