Loksabha And Rajyasabha : పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. 2021, నవంబర్ 29వ తేదీ ఉదయం 11.00 గంటలకు ఉభయసభలు ప్రారంభమయ్యాయి. ప్రారంభానికంటే ముందు… ఉద్యమంలో చనిపోయిన రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. అందులో భాగంగా..రైతులకు నష్టపరిహారం కోరుతూ కాంగ్రెస్ వాయిదా తీర్మానం ఇచ్చింది. ఇక తెలంగాణ ధాన్యం కొనుగోళ్ల అంశం పార్లమెంట్ను తాకింది. ఉభయ సభల్లో వాయిదా టీఆర్ఎస్ ఎంపీలు తీర్మానాలిచ్చారు. పార్లమెంట్ ఆవరణలో కాంగ్రెస్ ఎంపీలు ఆందోళన చేపట్టారు. సోనియాగాంధీ నేతృత్వంలో గాంధీ విగ్రహం వద్ద ఆందోళన నిర్వహించారు. కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. సభ ప్రారంభం కాగానే.. వరి ధాన్యంపై స్పష్టత ఇవ్వాలంటూ టీఆర్ఎస్ ఎంపీలు ప్లకార్డులు ప్రదర్శించారు. సభలో గందరగోళ పరిస్థితుల్లో ఉండడంతో మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేస్తున్నట్లు లోక్ సభ స్పీకర్ తెలిపారు.
Read More : Parliament : లోక్ సభలో నినాదాలు… మధ్యాహ్నానికి వాయిదా – Live Updates
మరోవైపు…
సభను సజావుగా నడిపేందుకు కఠినంగా వ్యవహరించాలని కేంద్రం నిర్ణయించింది. గత సమావేశాల్లో గందరగోళం సృష్టించిన ఎంపీలను సస్పెండ్ చేసే అవకాశం కూడా ఉంది. 20 మంది ఎంపీలను సస్పెండ్ చేసేందుకు కేంద్రం సిద్ధమైంది. సమావేశాలు జరుగుతున్న తీరుపై ఇటీవల సుప్రీం కోర్టు అసంతృప్తి వ్యక్తం చేయడంతో ఈసారి ఎలాంటి గందరగోళం జరగకుండా చూసేందుకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే.. లోక్సభ ముందుకు 3 వ్యవసాయ చట్టాల రద్దు బిల్లు రానుంది. 3 వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తూ బిల్లును సిద్ధం చేసింది కేంద్రం. సభలో ఈ బిల్లును వ్యవసాయ శాఖమంత్రి తోమర్ ప్రవేశపెట్టనున్నారు. పోరాటంలో 750 మందికిపైగా రైతులు మరణించారు. ఈ మేరకు ఒక సంతాప తీర్మానాన్ని పార్లమెంట్లో ఆమోదించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని కాంగ్రెస్ నిర్ణయించింది. శీతాకాల సమావేశాలు డిసెంబర్ 23 వరకు కొనసాగుతాయి. సెలవులు పోగా ఈసారి పార్లమెంట్లో మొత్తం 19 సెషన్స్ ఉంటాయి.