Raghunandan Rao
Raghunandan Rao Madhavaneni – BJP : తెలంగాణ బీజేపీలో పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. పార్టీ నేతల తీరు హాట్ టాపిక్ గా మారింది. నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు బీజేపీలో కలకలం రేపుతున్నాయి. అసలేం జరుగుతుందో అర్థం కాక పార్టీ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి. ఇప్పటికే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి మార్పు వ్యవహారం పార్టీలో తీవ్ర దుమారం రేపింది. నాయకులు రెండు వర్గాలుగా విడిపోయారు. బండి సంజయ్ నే అధ్యక్షుడిగా కొనసాగించాలని లేదంటే బీజేపీకి భారీ నష్టం తప్పదని కొందరు హెచ్చరిస్తున్నారు.
ఇది ఇలా ఉంటే, ఇప్పుడు బీజేపీ కీలక నేత, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. దుబ్బాకలో నన్ను చూసి జనాలు ఓట్లు వేశారు, బీజేపీని చూసి కాదని రఘునందన్ రావు అన్నారు. తనకు ఓ పదవి ఇవ్వాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. ఢిల్లీలో మీడియాతో చిట్ చాట్ లో రఘునందన్ రావు హాట్ కామెంట్స్ చేశారు.
తనకు పార్టీలో సరైన గుర్తింపు ఇవ్వాలని రఘునందన్ రావు డిమాండ్ చేశారు. మూడు పదవుల్లో ఏదో ఒక పదవి తనకు ఇవ్వాలన్నారు. పార్టీ అధ్యక్ష పదవి, ఫ్లోర్ లీడర్ లేదంటే జాతీయ అధికార ప్రతినిధి పోస్ట్ తనకు ఇవ్వాలన్నారు. పదేళ్ల నుంచి పార్టీ కోసం పని చేస్తున్నా అని ఆయన చెప్పారు. నేనెందుకు అధ్యక్ష పదవికి అర్హుడిని కాను అని ఆయన అడిగారు.
”చేసిన పనికి కూలి అడుగుతున్నా. కొన్ని విషయాల్లో నా కులమే నాకు శాపం కావచ్చు. నాకు పదవి ఇచ్చి చూడండి. రెండు నెలల్లో బీజేపీ ఎలా ఉంటుందో అందరికీ తెలుస్తుంది. రెండోసారి దుబ్బాక నుంచి ఎమ్మెల్యేగా గెలుస్తా. నాకు దుబ్బాక ఎన్నికల్లో ఎవరూ సాయం చెయ్యలేదు. నేను పార్టీలో ఉండాలని అనుకుంటున్నా. రూ.100 కోట్లు ఖర్చుపెట్టినా మునుగోడులో గెలవలేదు. అదే 100 కోట్లు నాకిస్తే తెలంగాణను దున్నేసేవాణ్ణి. దుబ్బాకలో నన్ను చూసే గెలిపించారు. కేసీఆర్ ను కొట్టే మొగోణ్ణి నేనే అని జనాలు నమ్మారు. అంతేకానీ బీజేపీని చూసి కాదు. నా కంటే ముందు బీజేపీ పోటీ చేస్తే వచ్చింది 3500 ఓట్లు. బండి సంజయ్ ది స్వయం కృతాపరాధం” అని ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు.