Sakshi-Dhoni : టీమ్ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని (MS Dhoni) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకుని మూడేళ్లు కావొస్తున్నా అతడి క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings)కు సారథ్యం వహిస్తున్న మహేంద్రుడు మోకాలి గాయంతో బాధపడుతూనే ఐపీఎల్ 2023 సీజన్లో సీఎస్కేను విజేతగా నిలిపాడు.
తన అద్భుత కెప్టెన్సీ నైపుణ్యాలతో ఐదో సారి చెన్నై జట్టుకు ఐదో ట్రోఫీని అందించాడు. ఐపీఎల్ ముగిసిన వెంటనే తన మోకాలికి ఆపరేషన్ చేయించుకున్నాడు. నీరజ్ చోప్రా, రిషబ్ పంత్ వంటి ప్లేయర్లకు ట్రీట్ మెంట్ చేసిన ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ దిన్షా పార్దీవాలా పర్యవేక్షణలో ధోనికి సర్జరీ జరిగినట్లు తెలుస్తోంది.
రాంచీలోని తన ఫామ్లో ఉంటున్న ధోని ప్రస్తుతం కోలుకుంటున్నాడు. ఇటీవల జిమ్ ట్రైనింగ్ కూడా స్టార్ చేశాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఇక ఐపీఎల్ 2023 సీజన్ తనకు చివరిది కాదని, ఐపీఎల్ 2024 కూడా ఆడాలని ఉన్నట్లు గుజరాత్ టైటాన్స్తో జరిగిన ఫైనల్ మ్యాచ్ అనంతరం ధోని తన మనసులోని మాటను వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అతడి భార్య సాక్షి ఇచ్చిన అప్డేట్తో ఫ్యాన్స్ మరింత సంతోషపడుతున్నారు.
మహేంద్రుడు ఇటీవలే సినీ రంగంలోకి అడుగుపెట్టాడు. ధోని ఎంటర్టైన్మెంట్ పేరిట ప్రొడక్షన్ హౌజ్ స్టార్ చేశాడు. సాక్షి నిర్మాతగా LGM అనే చిత్రాన్ని నిర్మించాడు. కోలీవుడ్లో ఈ సినిమా నేడు(జూలై 28)ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా ప్రమోషన్స్లో పాల్గొంటున్న సాక్షికి ధోని ఎలా ఉన్నాడు అంటూ అభిమానులు ప్రశ్నలు అడిగారు. ప్రస్తుతం ధోని చాలా బాగున్నాడని, రిహాబిలిటేషన్లో ఉన్నాడని చెప్పింది. పూర్తి ఫిట్నెస్ సాధించడంపై ఫోకస్ పెట్టాడని తెలిపింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది.
దీంతో.. ధోని ఐపీఎల్ 2024 ఆడడం పక్కా అంటూ కెప్టెన్ కూల్ అభిమానులు తెగ ఆనంద పడిపోతున్నారు.
“Mahi Bhai is recovering, he is in rehab”.
Waiting for IPL 2024. pic.twitter.com/0TCAtcPQvW
— Johns. (@CricCrazyJohns) July 28, 2023