Telangana: తెలంగాణ రాష్ట్రానికి ఉన్న అప్పుల వివరాల్ని కేంద్రం పార్లమెంట్లో వెల్లడించింది. ప్రస్తుతం తెలంగాణకు రూ.2,67,530 కోట్ల అప్పు ఉన్నట్లు కేంద్రం తెలిపింది. తెలంగాణ రాష్ట్రానికి ఉన్న అప్పుల గురించి లోక్ సభలో టీఆర్ఎస్ సభ్యులు వెంకటేశ్ నేత, రంజిత్ రెడ్డి, మాలోత్ కవిత అడిగిన ప్రశ్నకు కేంద్రం లిఖిత పూర్వక సమాధానం ఇచ్చింది.
దీని ప్రకారం… రాష్ట్ర అప్పుల భారం ప్రతి ఏటా పెరుగుతున్నట్లు కేంద్రం వెల్లడించింది. బడ్జెట్ లెక్కల ప్రకారం 2018లో తెలంగాణ అప్పు రూ.1,60,296 కోట్లుగా ఉంది. కాగా, ప్రస్తుతం తెలంగాణ అప్పు రూ.2,67,530 కోట్లకు చేరింది. 2020-21 నాటికి తెలంగాణ అప్పులు 18.7 శాతం పెరిగాయి. స్థూల జాతీయోత్పత్తిలోనూ అప్పుల శాతం పెరుగుతోంది. ముఖ్యంగా మూడేళ్లుగా అప్పుల శాతం పెరుగుతున్నట్లు నివేదికలు తెలియజేస్తున్నాయి. 2016లో రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తిలో అప్పుల శాతం 15.7 ఉండగా ఆ తరువాత భారీగా పెరుగుదల ఉన్నట్లు ఆర్ధిక శాఖ లెక్కల్లో వెల్లడించింది. 2022 నాటికి తెలంగాణ రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తిలో 27.4 శాతం అప్పులు నమోదైనట్లు తెలిపింది.