Bandi Sanjay Kumar (Photo : Twitter, Google)
Bandi Sanjay – Dharani Portal : ధరణి పోర్టల్ పై బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ధరణి పోర్టల్ పై తీవ్ర ఆరోపణలు చేస్తూ వస్తున్న బండి సంజయ్.. తాజాగా ధరణిని రద్దు చేయబోము అని చెప్పారు. బీజేపీ ప్రభుత్వం వచ్చినా.. ధరణిని బాగు చేస్తాం తప్ప రద్దు చేసేది లేదని బండి సంజయ్ తేల్చి చెప్పారు. అంతేకాదు బీఆర్ఎస్ అమలు చేస్తున్న ఏ సంక్షేమ పథకాన్ని కూడా రద్దు చేయము అన్నారు.
హైదరాబాద్ జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ సంయుక్త మోర్చాల సమావేశానికి బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్, కేంద్ర మాజీ మంత్రి ప్రకాష్ జవదేకర్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి హాజరయ్యారు.
మోదీ పేరు వింటేనే కేసీఆర్ గజగజ వణుకుతారు అని బండి సంజయ్ అన్నారు. బీజేపీ గ్రాఫ్ ను దెబ్బతీసి కాంగ్రెస్ ఇమేజ్ ను పెంచేందుకే కేసీఆర్ కుట్ర చేస్తున్నారని అన్నారు. కేసీఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్రం నాశనమైతోందన్నారు. ట్రిపుల్ ఐటీ విద్యార్థుల మరణాలు ప్రభుత్వ హత్యలే అని బండి సంజయ్ అన్నారు. బీజేపీ ప్రభుత్వం వచ్చాక.. సంక్షేమ పథకాలన్నీ మరింత మెరుగ్గా అమలు చేస్తామన్నారు.
అలాగే, ధరణిని బాగు చేస్తామే తప్ప రద్దు చేయబోము అని తేల్చి చెప్పారాయన. హిందుత్వ గురించి మాట్లాడి తీరుతా అని బండి సంజయ్ మరోసారి స్పష్టం చేశారు. హిందువుల దేవతలను కించపరుస్తుంటే చేతులు ముడుచుకోవాలా? అని ప్రశ్నించారు. డబుల్ ఇంజిన్ సర్కార్ తోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యం అని బండి సంజయ్ స్పష్టం చేశారు. ఈ నెల 22న ‘‘ఇంటింటికీ బీజేపీ’’ పేరుతో జనంలోకి వెళ్లాలని మోర్చాల సమావేశంలో పిలుపునిచ్చారు బండి సంజయ్.